వెంగళరావునగర్ : ఎస్.ఆర్.నగర్ ఎస్సై అశోక్ నాయక్, అతని సిబ్బంది తనను కొట్టారని ఆరోపిస్తూ బాపూనగర్కు చెందిన విశాల్ సింగ్ అనే వ్యక్తి నగర పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి బాధితుడు వీడియోలను సామాజిక మాద్యమాల్లో పోస్టు చేశాడు. కాగా పోలీసులు మాత్రం ఇందులో వాస్తవం లేదని కొట్టిపారేశారు.
వివరాల్లోకి వెళితే..బాపూనగర్కు చెందిన విశాల్సింగ్ ఉద్యోగాలిప్పిస్తానని తనను మోసం చేశాడంటూ స్థానిక బస్తీవాసి కుమారస్వామి ఈ నెల 18న ఎస్.ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే క్రమంలో ఈ నెల 22న ఎస్.ఆర్.నగర్ లోని నందిని బార్లో విశాల్సింగ్ అతని పై ఫిర్యాదు చేసిన కుమారస్వామి ఇద్దరు ఎదురుపడి ఘర్షణ పడ్డారు.
ఘర్షణ సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని స్టేషన్కు తీసుకుపోయారు. పోలీసు స్టేషన్కు తీసుకుపోయే క్రమంలో ఎస్సై అశోక్ నాయక్, అతని కానిస్టేబుళ్లు తనను తీవ్రంగా కొట్టారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈ మేరకు గాయాలతో ఉన్న వీడియోలను నగర పోలీసు కమిషనర్కు పంపడంతో పాటు సామాజిక మాద్యమాల్లో పోస్టు చేశాడు.
ఆరోపణల్లో వాస్తం లేదు..అంతా నాటకం
విశాల్సింగ్ ఆరోపిస్తున్నట్టుగా అతన్ని ఎవరూ కొట్టలేదని ఎస్.ఆర్.నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. కొందరికి ఉద్యోగా లిప్పిస్తానని మోసం చేశాడంటూ బాపూనగర్కు చెందిన కుమారస్వామి అనే వ్యక్తి ఫిర్యాదు ఇచ్చాడని, ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులు బార్లో గొడవ పడుతున్నారని సమాచారం అందడంతో కానిస్టేబుళ్లను పంపి బార్లో గొడవ పడుతున్న అతన్ని తీసుకువచ్చామన్నారు.
గతంలో కూడా విశాల్ సింగ్ పై పలు చీటింగ్ కేసులున్నాయన్నారు. ఎస్సై అశోక్ నాయక్ 21న రాత్రి విధులు నిర్వహించారని, 22న డ్యూటీకే రాలేదని తెలిపారు. విశాల్సింగ్ బార్లో నుంచి వస్తూ లిఫ్ట్లో తన తలను తానే గాయపరచుకున్నాడని, ఈ మేరకు తమ వద్ద సీసీ ఫుటేజీలు కూడా ఉన్నాయన్నారు.