అమీర్పేట్, ఫిబ్రవరి 7 : కాలనీల్లో పోగవుతున్న చెత్త సేకరణ ద్వారా పొట్టపోసుకుంటున్న దాదాపు 300 కుటుంబాలను వారు నివాసముంటున్న స్థలాల నుండి బలవంతంగా తరిమేసే ఉద్దేశంతో ప్రైవేట్ వ్యక్తుల చేత దాడులు చేయించారనని ఆరోపిస్తూ దాసారం హట్స్ బాధితులు శనివారం తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ దాసారం హట్స్ బాధితుల సమస్యలను వివరిస్తూ కమిషన్కు రాసిన లేఖను అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి నేతృత్వంలో హట్స్ బాధితులు ఎస్సీ కమిషన్ సభ్యుడు లక్ష్మినారాయణకు అందజేశారు.
ఈ నెల 4న ప్రైవేట్ వ్యక్తులు కొందరు దాసారం హట్స్ పరిసరాలకు చేరుకుని నిరుపేద దళిత కుటుంబాలపై దాడులకు పాల్పడ్డారని వివరిస్తూ, ఈ కేసు దర్యాప్తు అంశానికి సంబంధించి ఎస్ఆర్నగర్ పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఈ కేసుకు సంబంధించిన ఫిర్యాదులు, రిజిష్టర్, రికార్డులు స్వాధీనం చేసుకుని సమగ్ర దర్యాప్తుకు ఆదేశించాలని, నిరుపేద దళితులపై దాడి చేసిన వారిని గుర్తించి వారిపై అట్రాసిటీ కేసు పెట్టి తగిన శిక్ష పడేలా చూడాలని ఎమ్మెల్యే తలసాని లేఖలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గౌతమ్రెడ్డి, కట్టా బలరామ్, జోగిందర్సింగ్ తదితరులున్నారు.