కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 10 : గ్రేటర్లో భూ బకాసురుల ఆగలకు అడ్డు ఆదుపు లేకుండా పోతున్నది..ఒకప్పుడు పిల్లల ఆటపాటలతో పచ్చని చెట్లతో కళకళలాడాల్సిన పార్కు స్థలం ఇప్పుడు రియల్టర్ల మాయాజాలంతో ‘ప్లాట్’గా మారిపోయింది. సామాన్య ప్రజల ప్రాణవాయువును హరించేలా నిబంధనలను తుంగలో తొక్కి పార్కును కబ్జా చేస్తున్నా అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతామరని ప్రగల్భాలు పలికే హైడ్రా అటు వైపు కన్నెత్తి చూడకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. కుత్బుల్లాపూర్ మండలం పరిధిలోని జీడిమెట్ల సర్కిల్ పరిధిలోని గాయత్రి నగర్లో ఉన్న ఆర్వీ ధరిత్రి లేఅవుట్లో పార్కు స్థలం ఆక్రమణకు గురవుతుంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పచ్చని చెట్లతో కళకళలాడిన పార్కు స్థలం, ఇప్పుడు శిథిలాల కుప్పగా మారి అక్రమ ప్లాటుగా మారింది. తాజాగా బయటకు వచ్చిన దృశ్యాలు ఆక్రమణదారుల తెగింపును కళ్లకు కడుతున్నాయి. ఈ లేఅవుట్ సర్వే నంబర్ 132, 133, 135, 136(పార్ట్), 137, 140లలో విస్తరించి ఉంది. అయితే సర్వే నంబర్ 133లో ఉన్న సుమారు 1235 గజాల స్థలాన్ని బహిరంగ అవసరాల కోసం కేటాయించగా అక్రమార్కులు ఆ స్థలంపై కన్నేసి దాని రూపురేఖలను మార్చేశారు. భూముల ధరలకు రెక్కలు రావడంతో కబ్జాదారులు బరితెగించారు. నిబంధనల ప్రకారం కాలనీవాసుల అవసరాలకు చెందాల్సిన బహిరంగ స్థలాలను సైతం ప్లాట్లుగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా ఆర్వీ ధరిత్రి లేఅవుట్లో ఇదే పరిస్థితి నెలకొంది.
పార్కు..ప్లాటుగా మార్పు..
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పచ్చదనం పెంచే లక్ష్యంతో ఈ లేఅవుట్లోని పార్కు స్థలాన్ని ఎంతో శ్రద్ధతో అభివృద్ధి చేశారు. చుట్టూ మొక్కలు నాటి, కాలనీవాసులకు ఆహ్లాదాన్ని పంచేలా తీర్చిదిద్దారు. కానీ కాలక్రమేణా భూమి విలువ పెరగడంతో కబ్జాదారుల కన్ను ఈ ఖరీదైన స్థలంపై పడింది. జేసీబీలతో రంగంలోకి దిగిన ఆక్రమణదారులు ఏళ్ల తరబడి పెరిగిన పచ్చని చెట్లను నిర్ధాక్షిణ్యంగా తొలగించారు. పచ్చదనంతో నిండిన పార్కును గుట్టలు గుట్టలుగా మార్చి చదును చేశారు. ఇది ఒక పార్కు స్థలం అనే ఆనవాల్లు లేకుండా చేసి అక్కడ ఈ భూమి తమదే అంటూ కొంతమంది యథేచ్ఛగా బోర్డును కూడా ఏర్పాటు చేయడం వారి తెగింపునకు నిదర్శనంగా మారింది.
హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు…
ప్రభుత్వ ఆస్తులను, చెరువులను,పార్కులను కాపాడటంలో దూకుడుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారని స్థానికులు ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు నివాసితులందరూ కలిసి ఒక బృందంగా ఏర్పడి పార్కు స్థలం కబ్జాపై ఇటీవల హైడ్రా కమిషర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక మున్సిపల్ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. కాగా ఆక్రమణకు గురైన పార్కుకు ఆనుకొని సాగుతున్న బహుళ అంతస్తుల నిర్మాణాల స్థలంపై పూర్తి విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని, నిబంధనలు అతిక్రమించి లేఅవుట్ మ్యాప్ను మార్చి, పార్కు స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న వారి వెనుక ఉన్న పెద్దల హస్తంపై కూడా విచారణ జరపాలని పార్కు స్థలాన్ని రక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.