సిటీబ్యూరో, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 6వ తేదీ నుంచి అల్పాహారం అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం ఏర్పాట్లపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీష్, జోనల్ కమిషనర్లతో మంగళవారం కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రతి నియోజకవర్గం నుంచి ఒక పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారుల సహకారంతో ఎంపిక చేసి అల్పాహారం కార్యక్రమాన్ని ప్రారంభించాలని కమిషనర్ తెలిపారు. ఈ ప్రారంభోత్సవంలో అక్షయపాత్ర, ఇతర ట్రస్ట్ల భాగస్వామ్యంతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.