కేపీహెచ్బీ కాలనీ, జూలై 15 : గతేడాది కురిసిన భారీ వర్షాలతో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ యేడాది వర్షాకాలంలో ఎలాంటి విపత్తులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. ప్రధాన వర్షంనీటి కాలువలు, కాలనీలు, బస్తీలలోని అంతర్గత కాలువలపై దృష్టిసారించి ముంపు సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో వరదనీరు నిల్వడానికి గల కారణాలను గుర్తించి ఆ కాలువలను పునరుద్ధరించే పనులను చేపట్టారు. నీటి ప్రవాహానికి అడ్డంకులను తొలగించేలా వర్షంనీటి కాలువల బాటిల్నెక్ ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించి విస్తరించే పనులను చేపట్టారు. వరదనీటి కాలువలను బాక్స్డ్రైన్లుగా అభివృద్ధి చేసి భవిష్యత్లో ఇబ్బందు లు తలెత్తకుండా మరమ్మతు పనులు చేపట్టారు. ప్రమాదకరంగా ఉన్న కాలువలకు చైన్ లింక్ మెష్లను ఏర్పాటు చేశారు. కాలువలలో యథావిధిగా పూడికతీత పనులను చేపట్టడంతో పాటు ఆ పూడిక, వ్యర్థాలను నిర్మాణుష ప్రదేశాలకు ఎప్పటికప్పుడు తరలించేలా చర్యలు తీసుకున్నారు. వర్షంనీటి కాలువలలో కల్వర్టుల వద్ద వ్యర్థాలు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
గతేడాది వర్షాకాలంలో ముంపు సమస్యలు ఎదురైన ప్రాంతాల్లో కాలువల మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టారు. కూకట్పల్లి జోన్లోని ఐదు సర్కిళ్లలో రూ.85. 95 కోట్లతో 140 ప్రాంతాల్లో సుమారు 5కిలోమీటర్ల దూరం కాలువలకు మరమ్మతు పనులు చేశారు.48 ప్రాంతాల్లో 1.8 కిలోమీటర్ల దూరం కాలువలను మరమ్మతులు చేయగా, 38 ప్రాంతాల్లో 1.2 కిలోమీటర్ల దూరం బాక్స్డ్రైన్లు, పైప్డ్రైన్లను ఆధునీకరించగా మరో 24 ప్రాంతాల్లో 1.7 కిలోమీటర్ల దూరం కాలువల పక్కన చైన్లింక్ మెష్లను ఏర్పాటు చేశారు. మరోవైపు గొలుసుకట్టు చెరువుల ప్రధాన కాలువలన్నింటినీ పూర్తిస్థాయిలో ఆధునీకరించే పనులను చేపట్టేందుకు చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం సమస్యాత్మక ప్రాంతాల్లో చెరువు నుంచి మరో చెరువుకు వెళ్లే వరుదనీరు ప్రవహించే కాలువలన్నింటినీ అభివృద్ధి చేస్తున్నారు. అలాగే కాలనీలు, బస్తీలలో రోడ్డు పక్కనున్నటువంటి వరదనీటి కాలువల్లో పూడికను తొలగించి నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుం డా పనులు పూర్తి చేశారు.
వర్షాకాలంలో విపత్తులను ఎదుర్కొనేందుకు అత్యవసర బృందాలను సిద్ధం చేశారు.జోన్ పరిధిలోని 22 వార్డుల్లో 22 బృందాలు.. 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. వార్డుకొక వాహనం , 8మంది సిబ్బంది రెండు షిఫ్ట్లుగా పనిచేసేలా 176 మందిని సిద్ధంగా ఉంచారు. ప్రతి సర్కిల్కు ఒక జేసీబీ, ఇటాచి వాహనాలు అందుబాటులో ఉంటాయి. చెట్లు విరిగినా, మ్యాన్హోల్స్ పగిలిపోయినా, రోడ్డుపై గుంత లు పడినా, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచినా వెంటనే అత్యవసర బృందాలు అక్కడికి చేరుకుని తక్షణ సహాయక చర్యలు అందిస్తాయి. 6నెలల పాటు 24 గంటలు అందుబాటులో ఉండి అత్యవసర సేవలు అందించనున్నారు.
వర్షాకాలంలో విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. గతేడాది ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల్లో సమస్యను పరిష్కరించేలా కాలువలను అభివృద్ధి చేశాం. వర్షంనీటి కాలువలన్నింటిలో వ్యర్థాలను తొలగించాం. వార్డుకొకటి చొప్పున అత్యవసర బృందాలను సిద్ధం చేశాం.- వి.మమత, జడ్సీ, కూకట్పల్లి జోన్