సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : మూలిగే నక్కపై తాటిపండు పడిందన్న చందంగా.. అప్పుల ఊబిలో కూరుకుపోయిన జీహెచ్ఎంసీ ఖజానాపై మరింత ఆర్థిక భారం మోపే నిర్ణయాలకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే సంస్థ రూ. 6530కోట్ల అప్పులకు రోజు వారీ మిత్తి రూ. కోటికి పైగా చెల్లింపులు జరుపుతున్నారు. ప్రతి నెల ఒకటో తేదీ వచ్చిందంటే చాలు జీతభత్యాలు, పెన్షన్లు చెల్లించేందుకు ఆర్థిక విభాగం నానా తంటాలు పడుతున్నది.
ఈ నేపథ్యంలోనే పారిశుధ్య నిర్వహణలో భాగంగా స్వీపింగ్ యంత్రాల వ్యవహారంలో అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించిన కమిషనర్ కర్ణన్.. దాదాపు మూడు నెలల క్రితం స్వీపింగ్ యంత్రాల వినియోగాన్ని రద్దు చేశారు. ముచ్చటగా మూడు నెలల తిరగకముందే స్వీపింగ్ యంత్రాలను వినియోగించాలంటూ టెండర్లు పిలవడం చర్చనీయాంశంగా మారింది.
గ్రేటర్ హైదరాబాద్లో రహదారులపై దుమ్ము, దూళితో పాటు కాగితాలు, ఇతర చెత్తను తొలగించేందుకు స్వీపింగ్ యంత్రాలను అద్దె ప్రాతిపదికన తీసుకుని వినియోగిస్తుంటారు. దాదాపు 17కి పైగా స్వీపింగ్ యంత్రాల నిర్వహణకి ఏటా రూ.కోట్లలో ఖర్చు చేస్తుంటారు. అయితే స్వీపింగ్ యంత్రాల పనితీరు సరిగా లేదని, అక్రమాలు, అవినీతి జరుగుతుందని ఫిర్యాదులు రావడంతో స్వీపింగ్ యంత్రాలను రద్దు చేశారు. కార్మికులకు ఈ పనులను అప్పగించి ఈ యంత్రాల అవసరం లేకుండా చేసి ఖర్చు భారాన్ని తగ్గించారు.
అయితే స్వీపింగ్ యంత్రాల రద్దుపై మజ్లీస్ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కమిషనర్కు లేఖ రాశారు. స్వీపింగ్ యంత్రాలను కొనసాగించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. గడిచిన మూడు నెలలుగా ఒకవైపు కాంట్రాక్టర్లు, మజ్లిస్ పార్టీ ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అద్దె స్వీపింగ్ యంత్రాల కోసం టెండర్లు పిలిచారు.
ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్ జోన్లలో స్వీపింగ్ కోసం దాదాపు రూ. 2 కోట్లు కేటాయించారు. ఈ మేరకు నాన్ సీఆర్ఎంపీ రోడ్లలో ఎల్బీ నగర్ జోన్లో రూ. 78.50 లక్షలు, శేరిలింగంపల్లి జోన్లో రూ.56 లక్షలు, ఖైరతాబాద్ జోన్లో రూ.51 లక్షలు అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. అయితే వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వచ్ఛత పేరిట నెల రోజుల పాటు ఈ స్వీపింగ్ యంత్రాలకు టెండర్లు పిలవడం గమనార్హం.