‘విజన్ ఉంటే విపత్తులను కూడా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని..కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఎస్ఎన్డీపీ కార్యక్రమం అక్షరాలా నిరూపించింది’ అని మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. రెండు, మూడు రోజులుగా హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా.. లోతట్టు ప్రాంతాలకు ముంపు లేకుండా కాపాడటంలో ‘ఎస్ఎన్డీపీ’ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు.
KTR | సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు భారీ వర్షాలు, వరదలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యేవని, కాలనీల్లోని ఇండ్లలోకి వరద నీరు చేరి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారేదని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ కీలక సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలనే ఆలోచనలో భాగంగానే అద్భుతమైన ఎస్ఎన్డీపీ పథకం పురుడు పోసుకుందన్నారు. రాష్ట్ర రాజధానిలో వరద నీరు, మురుగునీటి వ్యవస్థను పూర్తి స్థాయిలో పటిష్ట పరిచేందుకు రూ.985 కోట్లతో 60 పనులు చేపట్టడంతో నేడు వరద ముప్పు తప్పిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా సహకారం లేకున్నా.. మొత్తం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఎస్ఎన్డీపీ పనులు చేపట్టడం మరో ప్రత్యేకత అని కేటీఆర్ వెల్లడించారు. చిన్నపాటి వర్షానికే పొంగిపొర్లే 36 కీలకమైన నాలాల అభివృద్ధి పనులను శరవేగంగా చేపట్టామన్నారు. తాజాగా రాజధానిలో ఇంత భారీగా వర్షం కురిసినప్పటికీ గతంలో ముంపునకు గురైన ప్రాంతాల్లో వరద నీరు నిల్వకపోవడం ఎస్ఎన్డీపీ ఘనతేనన్నారు. ఇదే విషయాన్ని ఆయా ప్రాంతాల్లోని ప్రజలే హర్షం వ్యక్తం చేస్తూ చెబుతుండటం గొప్ప సంతృప్తినిస్తున్నదన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎన్డీపీ పనుల్లో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.