మేడ్చల్, జూలై 14 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభానికి సిద్ధమవుతున్నది. శామీర్పేట మండలం అంతాయిపల్లిలో 1.52 లక్షల స్కేర్ ఫీట్లలో రూ.56 కోట్లతో చేపట్టిన ఈ భవన నిర్మాణ పనులు 85 శాతం పూర్తయ్యాయి. జూలై చివరి వారం వరకు పనులన్నీ పూర్తి చేసి కలెక్టర్ కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి ఇన్చార్జి కలెక్టర్ శ్వేతా మహంతి పర్యవేక్షణలో వేగంగా పనులు పూర్తి చేసేలా ఆర్అండ్బీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో నిర్మాణ పనుల్లో కొంత జాప్యం జరిగినా.. ప్రస్తుతం అదనపు సిబ్బందిని నియమించి పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ప్రస్తుతం ఫాల్సీలింగ్, ఫెన్సింగ్, ఎలక్ట్రికల్, తాగునీటి సరఫరా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా వాటిని ప్రారంభించి పూర్తి చేయనున్నారు. మరోవైపు నూతన కలెక్టరేట్లో గ్రీనరీ పెంచాలని అటవీశాఖాధికారులకు కలెక్టర్ శ్వేతా మహంతి సూచించగా.. అన్ని రకాల పూలు, నీడనిచ్చే మొక్కలను నాటేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
మేడ్చల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనం పనులు 85 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులను జూలై నెల చివరి వారం వరకు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఆదేశాల మేరకు త్వరితగతిన పనులు పూర్తి చేయించి అందుబాటులోకి తీసుకొస్తాం. -శ్రీనివాస మూర్తి, ఆర్అండ్బీ ఈఈ