మేడ్చల్ కలెక్టరేట్, మార్చి 13 : పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ వీసీ హాల్లో ఎన్నికల నోడల్ అధికారులతో ఎన్నికల సన్నద్ధతపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో భాగమైన అన్ని విభాగాల నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉండి.. ఎలాంటి లోపాలు తలెత్తకుండా తమ ఎన్నికల విధులు నిర్వర్తించాలని సూచించారు.
ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది డేటా నమోదు, అన్ని విభాగాల వారికి శిక్షణ పూర్తి చేయాలన్నారు. ఈవీఎంలు, ఎన్నికల సిబ్బంది రవాణాతో పాటు వాహనాలకు జీపీఎస్ విధానం అమర్చి.. వాటిని ట్రాక్ చేయాలని సూచించారు. ఎన్నికల ఖర్చు, ఎంసీఎంసీ కమిటీ ద్వారా పెయిడ్ న్యూస్, ప్రకటనల ఖర్చును వ్యయ నియంత్రణ కమిటీకి ఎప్పటికప్పుడు పంపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, డీఆర్ హరిప్రియ తదితరులు పాల్గొన్నారు.