కుత్బుల్లాపూర్, అక్టోబర్ 29 : ఎన్నికలకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని, నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించరాదని మేడ్చల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అధికారులకు సూచించారు. ఆదివారం అల్వాల్లోని లయోల కళాశాలలోని కుత్బుల్లాపూర్ డీఆర్పీ కేంద్రాన్ని సందర్శించి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్రూమ్, పోలింగ్ కేంద్రంలో పార్కింగ్, పోస్టల్ బ్యాలెట్ శిక్షణ, భోజన వసతులు తదితర వివరాలను కుత్బుల్లాపూర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పులి సైదులును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్లు, కాల్సెంటర్, వివిధ యాప్లను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.
ఆర్ఓ, ఏఆర్ఓలతో ఫారం 6, 7, 8 పోస్టల్ బ్యాలెట్ 12(డి)కి డిస్పోజల్కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో మొత్తం 6.69 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, 589 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, దుండిగల్, కొంపల్లి, నిజాంపేట్, బాచుపల్లి, గాజులరామారం, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో తొమ్మిది మంది ఏఆర్ఓలు తమ విధులను నిర్వర్తిస్తున్నారని కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలని, అధికారుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆయన వెంట బాలానగర్ ఏసీపీ గంగారం, ఈఆర్ఓలు, ఏఆర్ఓలు, సిబ్బంది ఉన్నారు. ఈ నెల 3వ తేది వరకు 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు.