మేడ్చల్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): లోక్ సభ ఎన్నికల నిర్వహణలో విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ఫారం 12ని వినియోగించుకోవాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ కోరారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లోని వీసీ హాల్లో అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ, ఇందుకు గాను సీఈఓ కార్యాలయం వెబ్సైట్ నందున్న పోస్టల్కు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఈ క్రమంలో ప్రతి జిల్లా అధికారి తమ కార్యాలయ సిబ్బందితో సహా తమ వివరాలను పొందుపరిచే బాధ్యత నోడల్ అధికారులదేనని అన్నారు. మే 6వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులను తీసుకుంటామన్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎన్నికల రోజున విధులు నిర్వహించే పోలింగ్, పోలీస్ సిబ్బందికి సర్వీస్ ఓటర్లకు ఫారం 12 అందించి దరఖాస్తు చేసుకున్న ఓటర్లకు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు వేయాల్సి ఉంటుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ పక్రియను అత్యంత పకడ్బందీంగా నిర్వహించాలని కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, డీఆర్వో హరిప్రియ జిల్లా అధికారులు పాల్గొన్నారు.