ఎర్రగడ్డ, ఫిబ్రవరి 27 : ఈ సారి పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అందరూ ఉత్తమ ఫలితాలను సాధించి అటు పాఠశాలకు, ఇటు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ విద్యార్థులకు సూచించారు. మంగళవారం బోరబండలోని నాట్కో ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. డీఈఓ రోహిణి, ఉప విద్యాశాఖాధికారి సామ్యూల్ రాజ్లతో కలిసి పాఠశాలలోని తరగతి గదులు, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం తదితర వాటిని పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బోధనా సిబ్బంది అందుబాటులో లేరని హెచ్ఎం గీత కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రత్యామ్నయంగా తక్కువ సంఖ్యలో విద్యార్థులున్న సమీప ప్రభుత్వ పాఠశాల నుంచి బోధనా సిబ్బందిని నాట్కో పాఠశాలకు రప్పించాలని కలెక్టర్ సూచించారు.
చిన్న చిన్న విషయాల పట్ల నిర్ణయాలు తీసుకుని విద్యాబోధనకు ఆటంకం ఏర్పడకుండా చూడాలని, వాటినే పెద్ద సమస్యగా భావించరాదని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు. క్రమశిక్షణతో కూడిన చదువు ఉన్నత శిఖరాలను చేరుకోవటానికి సులువైన మార్గమని పేర్కొన్నారు. సమీపంలోని ఉర్దూ మీడియం ప్రభుత్వ పాఠశాలలో వివిధ సదుపాయాలను కల్పించడానికి గతంలో ప్రభుత్వం నిర్ణయించిందని.. ఆయా పనులను వెంటనే చేపట్టాలని కోరుతూ బీఆర్ఎస్ నేత మహ్మద్యూసుఫ్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. పరిశీలించి వెంటనే నిర్ణయం తీసుకోవాలని డీఈఓకు కలెక్టర్ సూచించారు.