సిటీబ్యూరో, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : తెలిసీ.. తెలియక నోటరీ ద్వారా స్థలాలు కొని సరియైన పత్రాలు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. రిజిస్టర్ కాని వ్యవసాయేతర భూములను జీవో 84కింద ఉచితంగానే రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 84 ప్రకారం దరఖాస్తులతో పాటు నోటరీ, లింక్ పత్రాలు, ఆస్తిపన్ను రసీదులు, కరెంట్ బిల్లు రసీదుతో పాటు ఆస్తులకు సంబంధించిన ఆధారాలతో సహా మీసేవ కేంద్రాల్లో అక్టోబరు 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 125గజాల వరకు ఎటువంటి స్టాంపు డ్యూటీ, అపరాధ రుసుం ఉండదని, 125 గజాలు మించితే దరఖాస్తు చేసిన తేదీ నాటికి ఉన్న మార్కెట్ ధర ప్రకారం స్టాంపు డ్యూటీతో పాటు అదనంగా రూ.5 జరిమానా విధించనున్నట్లు జీవోలో పేర్కొన్నారు. 3వేల చదరపు గజాలలోపు స్థలానికి నోటరీ చేసిన పత్రాలను మాత్రమే రిజిస్ట్రేషన్ శాఖ లింకు డాక్యుమెంట్స్గా పరిగణిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.