సిటీబ్యూరో, సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జిల్లాలోని పదిహేను నియోజక వర్గాలలో గృహలక్ష్మి పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేయడంపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో శుక్రవారం తహసీల్దార్లు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని పదిహేను నియోజక వర్గాల పరిధిలో ఒక్కొక్క నియోజక వర్గంలో 3000 మంది లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. గృహలక్ష్మి లబ్ధిదారులను ఎంపికప్పుడు పరిశీలించి, అర్హులైన వారిని గుర్తించి పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు.
క్షేత్ర స్థాయి పరిశీలనలో అందించిన గృహలక్ష్మి దరఖాస్తుదారులకు రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డ్, హౌస్సైట్, రేకుల షెడ్లను ప్రామాణికంగా తీసుకోవాలన్నారు. అలాగే, జీవో నం: 58, 59లో పెండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్ను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జీవో 59కు సంబంధించి ఆమోదించిన లబ్ధిదారులు చెల్లించవలసిన డబ్బులను వెంటనే చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్, డీఆర్వో వెంకటాచారి, స్పెషల్ ఆఫీసర్లు మండల తహసీల్దార్లతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.