సిటీబ్యూరో, ఏప్రిల్ 9(నమస్తే తెలంగాణ): వేసవి దృష్ట్యా వినియోగదారులకు ఎంత విద్యుత్ అవసరం ఉన్నా సరఫరా చేసేందుకు విద్యుత్ అందుబాటులో ఉండటంతో అదనంగా మౌలిక వసతులు కల్పించడంపై విద్యుత్ శాఖ దృష్టి సారించింది. గ్రేటర్ పరిధిలోని 9 సర్కిళ్లలో ఉన్న సబ్ స్టేషన్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్(డీటీఆర్)లపై ఎక్కడెక్కడ అధికంగా లోడు ఉందో గుర్తించి, అక్కడ అదనంగా పవర్ ట్రాన్స్ఫార్మర్లు, డీటీఆర్లను ఏర్పాటు చేసేలా సీఎండీ ముషారఫ్ ఫరూఖీ చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా సీజీఎంలు, సర్కిల్ ఎస్ఈలతో ఎప్పటికప్పుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రత్యేకంగా నివేదికలు తీసుకొని వెంటనే అక్కడ అదనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
వేసవి కాలం ప్రారంభమయ్యే మార్చి, ఏప్రిల్ నెలల్లోనే ఈసారి ఊహించిన దానికంటే విద్యుత్కు ఎక్కువ డిమాండ్ వస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం వివిధ సబ్ స్టేషన్లలో 80 శాతం కంటే ఎక్కువ లోడు ఎదుర్కొంటున్న పవర్ ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో ఎక్కువ కెపాసిటీ గల పీటీఆర్లతో మార్పిడి చేశారు. అదేవిధంగా డీటీఆర్లపై లోడ్ బ్యాలెన్సింగ్ కోసం టంగ్ టెస్టర్ ద్వారా కచ్చితమైన లోడ్లను రికార్డు చేస్తూ, డీటీఆర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలోని 9 సర్కిళ్లలో 1494 డీటీఆర్లు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఇలా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని వేసవి కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేస్తూ విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చేస్తున్నారు.