ఎర్రగడ్డ, ఆగస్టు 20: దశాబ్దాల పాటు ఎదుర్కొన్న ప్రధాన సమస్యను బీఆర్ఎస్ సర్కారు తీర్చినందుకు 5 కాలనీల వాసులు హర్షం వ్యక్తం చేశారు. బోరబండకు చెందిన ఎన్ఆర్ఆర్పురం కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో సభ్యులకు చెందిన ఇండ్ల థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ అంశం పై ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చొరవతో సీఎం కేసీఆర్ స్పందించారు. ఇటీవల థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ ఫైలుపై సీఎం సంతకం చేశారు. ఇందుకు కృతజ్ఞతగా ఆదివారం సొసైటీ పరిధిలోని 5 కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఎమ్మెల్యే గోపీనాథ్ గుర్రపు బగ్గీపై ఆసీనులు కాగా వందలాది మంది ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. హైటెక్ హోటల్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ భారీ కటౌట్ను ఏర్పాటు చేసి ఎమ్మెల్యేతో పాటు హౌసింగ్ సొసైటీ నేతలు, సంక్షేమ సంఘాల ప్రతినిధులు క్షీరాభిషేకం చేశారు. తమ ఇంటి సమస్యలను తీర్చడంలో సహకారం అందించిన ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ సందర్భంగా హైటెక్ హోటల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్ఆర్ఆర్పురం కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి తన సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఇండ్ల థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ అంశాన్ని పరిష్కరిచామని వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయకుమార్, విజయసింహ, సిరాజ్, హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ఎంఏ సత్తార్, ప్రతినిధులు యూసుఫుద్దీన్, అహ్మద్అలీ, సత్తాజీ, కాలనీల సంక్షేమ సంఘాల నేతలు గౌస్, తిరుపతయ్య, ఫయాజ్ఖాన్, గఫార్, ముక్రమ్, సునీల్, బేగ్, శివకుమార్గుప్త, బీఆర్ఎస్ నేతలు ఏడీ మధు, రామకృష్ణ, యూసుఫ్, బాబానాయక్, ధర్మ, దేవమణి, షరీఫ్, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.