Numaish | హైదరాబాద్ : హైదరాబాద్ అంటే చార్మినార్, ట్యాంక్ బండ్ గుర్తుకు వస్తాయని, ఆ తర్వాత గుర్తు వచ్చేది నుమాయిష్ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ను సీఎం రేవంత్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ప్రతీ ఏటా నుమాయిష్ ప్రాధాన్యత తగ్గకుండా నిర్వహిస్తున్న సొసైటీకి అభినందనలు తెలిపారు. కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కాలేజీగా అప్ గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం తరపు నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు. సామాజిక బాధ్యతతో నిర్వహిస్తున్న విద్యా సంస్థలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. హైదరాబాద్కు గుర్తింపు తెచ్చేందుకు, నుమాయిష్ను ముందుకు తీసుకెళ్లేందుకు అండగా ఉంటామన్నారు. మీ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది అని రేవంత్ పేర్కొన్నారు.