సిటీబ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ): నానక్రాంగూడ ఔటర్ రింగురోడ్డు ఇంటర్చేంజ్లో ఉన్న హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్) కార్యాలయం వీవీఐపీలకు ప్రధాన కేంద్రంగా మారనున్నది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి ఒక కార్యాలయాన్ని అక్కడే ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు సీఎం రేవంత్ రెడ్డి హెచ్జీసీఎల్ కార్యాలయం నుంచి ఎంఎయూడీ పరిధిలోని పలు శాఖలతో ఉన్నతాధికారులు, ఆయా శాఖలు చేపట్టే ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షలు నిర్వహించారు. ప్రత్యేకంగా పురపాలక శాఖకు సంబంధించిన కార్యకలాపాలకు ఇది ఎంతో అనువుగా ఉండటంతో ఇక్కడి నుంచే ఆ శాఖ పరిధిలోని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్బోర్డు, మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ (ఎంఆర్డీసీఎల్) వంటి శాఖల ఉన్నతాధికారులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నానక్రాంగూడ హెచ్జీసీఎల్ భవనాల వద్ద భద్రతపరంగా పటిష్టమైన చర్యలు చేపట్టాలని హెచ్ఎండీఏ అధికారులు నిర్ణయించారు.
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వద్దే ఉండటంతో ఇక్కడ ఆయన కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కూర్చునేందుకు ప్రత్యేకంగా చాంబర్తో పాటు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించేందుకు సెమినార్ హాల్స్ రెండు ఉన్నాయి. దీంతో సీఎం స్థాయికి తగ్గట్టుగా ఇక్కడ మార్పులు చేర్పులు చేస్తూ హెచ్జీసీఎల్ కార్యాలయంలో భద్రతాపరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా సుమారు రూ.60 లక్షల వ్యయంతో రెండు భవనాల చుట్టూ రక్షణగా వ్యూ కట్టర్స్ను ఏర్పాటు చేస్తున్నారు. త్రిభుజాకారంలో ఉన్న ఈ భవనాల చుట్టూ రోడ్లే ఉన్నాయి. దీంతో ఈ చర్యలు చేపట్టినట్లు ఓ అధికారి తెలిపారు.
హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన కీలకమైన ప్రభుత్వ శాఖలతో తరచూ సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర సచివాలయం కన్నా ఇది ఎంతో అనువుగా ఉంటుందని గుర్తించారు. అదేవిధంగా కొత్తగా మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు సంబంధించిన కార్యాలయాన్ని తార్నాక నుంచి ఇక్కడికి తరలిస్తున్నారు. ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు అధిక ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో దాని పురోగతిని సీఎం స్వయంగా పర్యవేక్షించేందుకు వీలుగా ఇక్కడ కార్యాలయాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే సుమారు రూ.70 లక్షల వ్యయంతో ఇంటీరియర్ పనులు చేపట్టారు. ఐటీ కారిడార్లో ఉన్న ఈ రెండు భవనాలను ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టు నిర్వహణ కోసం ప్రత్యేకంగా గచ్చిబౌలి నుంచి నార్సింగి వెళ్లే మార్గంలో నానక్రాంగూడ జంక్షన్లో హెచ్ఎండీఏ నిర్మించింది. అమీర్పేటలో హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయం ఉన్నా, మెట్రోపాలిటన్ కమిషనర్, జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్లు ఎక్కువ సమయంలో ఇక్కడున్న తమ చాంబర్ల నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఓఆర్ఆర్ నానక్రాంగూడ ఇంటర్చేంజ్లో ఉన్న హెచ్జీసీఎల్ భవనాల్లో సీఎం కోసం ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుండటంతో పార్కింగ్ సమస్య ఉత్పన్నమవుతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే ఉన్న రెండు భవనాల్లో ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టుకు సంబంధించిన కార్యాలయం, టీ ఫైబర్, హైదరాబాద్ ఫార్మా సిటీ, టీఎస్ బీపాస్, హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్ , మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాలు ఉన్నాయి. దీంతో ఈ రెండు భవనాల్లో సీఎం వచ్చిన సమయంలో వాహనాల పార్కింగ్కు ఇబ్బందులు తలెత్తుతున్నాయని గుర్తించి, మరో చోట పార్కింగ్ స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు.