సిటీబ్యూరో, మార్చి 5 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ముందు ఏం చేసినా చెల్లుతుందిలే అన్నట్లుగా వ్యవహరిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతిష్టాత్మకమైన అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టాలంటే సాంకేతికంగా రకరకాల అనుమతులు, డిజైన్లు, వ్యయం ఇలా ఎన్నో అంశాలపై పూర్తి స్థాయిలో నివేదికలు సిద్ధం చేయాలి. కానీ, ఇవేమీ లేకుండానే ప్రాథమికంగా ప్రతిపాదనల దశలో ఉన్న రెండు భారీ స్కైవేల నిర్మాణ ప్రాజెక్టు పనులకు ఏకంగా శంకుస్థాపన చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి తూంకుంట వరకు రాజీవ్ రహదారిపై, ప్యారడైజ్ నుంచి కండ్లకోయ వైపు ఉన్న నాగ్పూర్ జాతీయ రహదారిపై భారీ ఫ్లై ఓవర్లు నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈనెల 7న స్టేట్ హైవే-1పై ఎలివేటెడ్ కారిడార్, 9వ తేదీన ఎన్హెచ్- 44పై ఎలివేటెడ్ కారిడార్లకు సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా రెండు స్కైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం పురపాలక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ రెండు స్కైవేల నిర్మాణానికి సికింద్రాబాద్ కంటోన్మెట్లో వందకు పైగా ఎకరాల భూములు అవసరం ఉండటంతో ఏళ్ల తరబడి పెండింగ్లోనే ఉంది. వారం రోజుల కిత్రం రక్షణ శాఖ అంగీకరించడం, వెంటనే పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండటంతో హడావిడిగా శంకుస్థాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ రెండు భారీ ప్రాజెక్టులను చేపట్టేందుకు రక్షణ శాఖ నిబంధనలు పెట్టింది. వాటి గురించి సమగ్ర అధ్యయనం, ప్రాజెక్టు డిజైన్, వ్యయం అంచనాలను రూపొందించకుండానే శంకుస్థాపన చేయడం.. వచ్చే పార్లమెంటు ఎన్నికల స్టంట్ అని పలువురు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టుల నిమిత్తం హెచ్ఎండీఏ ఉన్నతాధికారి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీఈఓ, డిఫెన్స్ ఎస్టేట్ అధికారి, స్థానిక మిలిటరీ అథారిటీ.. ఇలా నలుగురు సభ్యులతో కూడిన బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. ఇది ఎంతో కీలకమైనప్పటికీ ఇప్పటి వరకు బోర్డు మీటింగ్లో భూముల అప్పగింత, ప్రాజెక్టు చేపట్టే తీరుపై ఎలాంటి సమావేశం జరగలేదు. కానీ హడావిడిగా శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు చేశారు.