ఖైరతాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మాదిగల ఉనికి లేకుండా చేయాలన్న కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narsimhulu) ఆరోపించారు. మాదిగ శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరి సురేందర్ సన్ని అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచే మాదిగలకు మోసం చేస్తుందని, 80 లక్షల జనాభా కలిగిన మాదిగలకు ఒక్క సీటు(Seats ) కూడా కేటాయించకపోవడం ఇందుకు నిదర్శనమని ఆరోపించారు.
మాదిగలు డబ్బులిస్తే ఓట్లు వేస్తారన్న చులకభావనతో ఉన్నారని, రాజకీయ చైతన్యం లేకపోవడం వల్లే ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో కాపులంతా ఒకే తాటిపై నిలబడడం వల్లే పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారని అన్నారు. ఇప్పుడు ఆ కులానికి ఎంతో విలువ పెరిగిందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి చిత్రపటం ఉండాలనడం చంద్రబాబు గొప్పతనమన్నారు.
దివంగత సీఎం ఎన్టీఆర్(NTR) హయాంలోనే మాదిగలకు గుర్తింపు వచ్చిందని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తర్వాత మాదిగల ఉనికికే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఈ సమావేశంలో ఉస్మానియా అధ్యాపకులు ప్రొఫెసర్ కాశీం, సామాజిక తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తాళ్ల అజయ్, గణేశ్, ప్రభాకర్, ఆంజనేయులు, డాక్టర్ సంజీవ్ నాయక్, రజనీ, పవన్ కుమార్, నారాయణ, వెంకటేశ్వర ప్రసాద్, రవి తదితరులు పాల్గొన్నారు.