సిటీబ్యూరో, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరంలో మూసీ పరివాహక ప్రాంతాన్ని ఉపాధి, ఆర్థికాభివృద్ధి బెల్ట్గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్పై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూసీ ప్రవహిస్తున్న ప్రాంతాలను పర్యాటక, స్వీయ ఆర్థిక చోదక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. మూసీ నది వెంట ప్రభుత్వ- ప్రైవేట్-పార్టనర్షిప్ (పీపీపీ) పద్ధతిలో బ్రిడ్జిలు, కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్లు, అమ్యూజ్మెంట్ పార్కులు, హాకర్ జోన్లు, పాత్వేలను నిర్మించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మూసీలో కాలుష్యం తగ్గించడంతో పాటు మురుగునీరు ప్రవహించకుండా అవసరమైన ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నారు. మూసీలో శుద్ధి చేసిన నీరు ప్రవహించేందుకు చర్యలు చేపట్టడంతో పాటు తగు నీటి మట్టం ఉండేలా చెక్ డ్యాంలు నిర్మించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జలమండలి ఎండి దానకిశోర్, సీఎంవో అధికారులు శేషాద్రి, శివధర్ రెడ్డి, షానవాజ్ ఖాసిం, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తదితరులు పాల్గొన్నారు.