GHMC | కొండాపూర్/సిటీబ్యూరో, జనవరి 31 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో అంతా గందరగోళమే అన్నదానికి బుధవారం చోటు చేసుకున్న పరిణామమే ఉదాహరణ. వీధి వ్యాపారుల విషయంలో బుధవారం ఒకే రోజు రెండు వినూత్న నిర్ణయాలు అన్ని వర్గాలను విస్మయానికి గురి చేశాయి. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సమీపంలోని కోహినూర్ హోటల్ ఎదురుగా కుమారి అనే మహిళ నడుపుతున్న ఫుడ్స్టాల్తో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అక్కడి నుంచి తొలగించి.. మరో చోట పెట్టుకోవాలంటూ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న కుమారి ఫుడ్స్టాల్కు మరుసటి రోజే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అండగా నిలుస్తూ..ఫుడ్స్టాల్ కొనసాగింపునకు అనుమతిచ్చారు.
ఈ మేరకు డీజీపీతో పాటు మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్ నిర్ణయంతో ట్రాఫిక్ పోలీసులు ఒకింత షాక్కు గురయ్యారు. ఇదిలా ఉంటే ఈ స్థలానికి కూతవేటు దూరంలో ఉన్న దుర్గం చెరువు నుంచి ఇనార్బిట్ మాల్ రోడ్లో దాదాపు మూడేండ్లుగా దాదాపు 25 మంది వరకు చిరు వ్యాపారులు జీవనం సాగిస్తున్నారు. తోపుడుబండ్లు, చిన్న చిన్న రేకుల షెడ్డులను ఏర్పాటు చేసుకొని ఆహార పదార్థాలు, టీ , ఇతర శీతల పానీయాలు, తినుబండారాలు వంటి వాటితో జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ చిరు వ్యాపారులపై కమిషనర్ కన్నెర్రజేశారు.
దుర్గం చెరువు పర్యటన సందర్భంగా ఈ చిరు వ్యాపారాలను తొలగించాలని, లేదంటే సస్పెండ్ చేస్తానంటూ జోనల్ అధికారులను కమిషనర్ హెచ్చరించారు. కమిషనర్ ఆదేశాలను అందుకున్న జోనల్ అధికారులు, టాస్క్ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగి తోపుడు బండ్లను తుక్కుతుక్కు చేశారు..చిన్నగా ఏర్పాటు చేసుకున్న రేకులను పూర్తిగా తొలగించారు. కనీసం ఈ ప్రాంతం నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని సూచించే సమయం కూడా ఇవ్వకుండా మూసి వేసి ఉన్న తోపుడుబండ్లను పూర్తిగా ధ్వంసం చేయడం ఏమిటని చిరువ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డి కుమారికి అక్కడే వ్యాపారం చేసుకునేందుకు భరోసా ఇచ్చారని, జీహెచ్ఎంసీ కమిషనర్ మాత్రం చిరు వ్యాపారులపై ప్రతాపం చూపించారని మండిపడ్డారు.
హైదరాబాద్, జనవరి 31(నమస్తే తెలంగాణ): రోడ్డు వెంబడి చిన్న ఫుడ్ కోర్టు నడుపుకుంటున్న కుమారి హోటల్ను మూయించి ఆమె పొట్ట కొట్టింది ఎవరని బీఆర్ఎస్ నేత సతీశ్ రెడ్డి ప్రశ్నించారు. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతున్నదని ఆమె హోటల్ను ట్రాఫిక్ పోలీసులు మూయించడం, అనంతరం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించడం వెనుక అసలు కారణం ఏమిటని ఎక్స్ వేదికగా నిలదీశారు. అసలు కుమారి హోటల్ను మూసేసింది ఎవరు?, ఆమెపై కేసు పెట్టింది ఎవరు?, పబ్లిసిటీ చేసుకుంటున్నది ఎవరు?.. అని సతీశ్ రెడ్డి ప్రశ్నించారు.