సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 3 నుంచి 6వరకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ ఆమ్రపాలి ఆధ్వర్యంలో అధికారుల బృందం గుజరాత్లో పర్యటించింది. అహ్మదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, యమునా నదిని సందర్శించి, ఆయా ప్రాజెక్టులకు అనుసంధానంగా ఉన్న సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను వాటి సామర్థ్యాన్ని పరిశీలించారు.
అనంతరం కేంద్ర ప్రభుత్వ నమామి గంగ ప్రాజెక్టు డైరెక్టర్ జనరల్ (డీజీ) అశోక్కుమార్తో కలిసి చర్చించారు. అహ్మదాబాద్ మునిసిపల్ ఉన్నతాధికారి తెన్నరసన్, సబర్మతి రివర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ జగదీశ్ పటేల్, జనరల్ మేనేజర్ సుశాంత్ భాటియా, నమామి గంగా ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశిష్ట, ఉన్నతాధికారులు ఎన్.కె.మదన్, పీయూష్ గుప్తా తదితరులతో మూసీ రివర్ ఫ్రంట్ అధికారులు సమావేశం అయ్యారు.