హైదరాబాద్ : జాతీయ స్థాయి పోటీల్లో పలు పథకాలను సాధించిన క్రీడాకారులను
క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో అభినందించారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SATS) ఆధ్వర్యంలోని తెలంగాణ క్రీడా పాఠశాల (హకీమ్ పేట) కు చెందిన క్రీడాకారులు ఏప్రిల్ 1 నుంచి 5 వరకు చండీగడ్లో జరిగిన అల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీస్ ఛాంపియన్ షిప్లో రోయింగ్, వెయిట్ లిఫ్టింగ్లో క్రీడాకారులు గణేష్ – వెయిట్ లిఫ్టింగ్ లో బంగారు పతకం, రోయింగ్ లో భాను -రజత, హేమలత కాంస్య పతకాలను సాధించిన సందర్భంగా మంత్రి అభినందించారు.
అనంతరం జూన్ 6 – 13 వరకు ఉజ్జెకిస్థాన్లో జరిగే అండర్- 17 విభాగంలో 14వ ఏషియన్ విమెన్ వాలీ బాల్ ఛాంపియన్స్ కు స్పోర్ట్స్ స్కూల్ కు చెందిన క్రీడాకారిణులు సుజాత, రిషిత, యమినిఎంపికయ్యారని మంత్రికి స్పోర్ట్స్ స్కూల్ ఓస్డీ డా. హరికృష్ణ వివరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి అనేక చర్యలు చేపడుతున్నారన్నారు. క్రీడా పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
అద్భుత ప్రతిభ ను కనబరిచే క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలను అందిస్తామన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి పేరు తేవాలని మంత్రి ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అధికారి ఆర్కే బోస్, కోచ్ లు మాణిక్యాలరావు, విరా రెడ్డి పాల్గొన్నారు.