భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా ప్రారంభించనున్నది. రంగారెడ్డి జిల్లా చిలుకూరు ఫారెస్ట్ బ్లాక్ పరిధిలోని మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో సీఎం కేసీఆర్.. మొక్కలు నాటి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా ఒకేరోజు 4.30 లక్షల మొక్కలను నాటేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
ప్రజాప్రతినిధులతోపాటు, సామాన్యులు, విద్యార్థులు ఈ మహాక్రతువులో పాల్గొననున్నారు. జిల్లాలోని 558 గ్రామ పంచాయతీల్లో కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని చేపడుతుండగా..ప్రతి పంచాయతీలోనూ 750 మొక్కలను నాటనున్నారు. మున్సిపాలిటీల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్.. జూన్ 19న తుమ్మలూరు రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్లో మొక్కను నాటి హరితోత్సవాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమానికి సైతం రంగారెడ్డి జిల్లానే వేదికగా నిలుస్తున్నది.