సిటీబ్యూరో, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోనున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నగరానికి చెందిన మేయర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రూ. 6,250 కోట్లతో 31 కిలో మీటర్ల మేర నిర్మించనున్న ఈ ప్రాజెక్టు పనులకు ఈ నెల 9న మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. శంకుస్థాపన అనంతరం రాజేంద్రనగర్లోని తెలంగాణ పోలీస్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు.
నగరంలోని అన్ని నియోజకవర్గాల నుంచి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని సూచించారు. ఈ ప్రాజెక్టు విమానయాన ప్రయాణికులు, ఐటీ కారిడార్, అనేక మందికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, ప్రభాకర్ రావు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, సాయన్న, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, నియోజకవర్గ ఇన్చార్జిలు ఆనంద్ గౌడ్, ప్రేం సింగ్ రాథోడ్, నంద కిశోర్ వ్యాస్, శ్యాం సుందర్ రెడ్డి, సలావుద్దీన్ లోది, జీవన్ సింగ్, బాక్రీ, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.