సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ):స్వరాష్ట్రంలో మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. చరిత్రలో నిలిచిపోయేలా అత్యాధునిక వసతులతో నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ తమ ఛాంబర్లలో కొలువుదీరారు. కీలక దస్ర్తాలపై సీఎం కేసీఆర్, మంత్రులు సంతకాలు చేశారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఫైలుపై ముఖ్యమంత్రి తొలి సంతకం చేయడంతో ఆ ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసింది. డబుల్ ఇండ్ల మార్గదర్శకాలు, బల్దియా పరిధిలో ధూపదీప నైవేద్య పథకం అమలు ఫైళ్లపై ఆయా శాఖల మంత్రులు సంతకాలు పెట్టగా.. ఈ సందర్భంగా అర్చక సంఘాల నేతలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సొంతింటి కల సాకారం చేసుకోబోతున్న పేదల్లో సంతోషం వ్యక్తమైంది. ఇక ట్యాంక్బండ్ పరిసరాల్లో సందడి నెలకొంది. సాగర్లో సెక్రటేరియట్ నమూనాతో భగీరథ బోటు ..సందర్శకులను కనువిందు చేసింది. రాత్రి వేళ..ఆకాశంలో బాణాసంచా మిరుమిట్లు గొలిపితే.. రంగురంగుల విద్యుద్దీపాల కాంతులతో పాలనా సౌధం దేదీప్యమానంగా వెలిగిపోయి.. వీక్షకులను చూపు తిప్పుకోనివ్వలేదు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం ఆదివారం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రులు… పలు కీలక ఫైళ్లపై సంతకాలు చేసి రాష్ట్ర ప్రజానీకానికి శుభవార్త తెలిపిండ్రు. సీఎం కేసీఆర్ పోడు భూముల పంపిణీ ఫైలుపై తొలి సంతకం చేయగా… మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపుపై తొలి సంతకం చేశారు. అలాగే రాష్ట్ర మంత్రులు ఆయా శాఖలకు సంబంధించిన ఫైళ్లపై తొలి సంతకాలు చేసి ప్రజలు, కాంట్రాక్టు ఉద్యోగులు, అర్చకులు, కార్మికులు, అంగన్వాడీలు, పలు పథకాల లబ్ధిదారులకు, ప్రభుత్వ ఉపాధ్యాయులకు తీపి కబురు అందించారు. ఈ సందర్భంగా పలు ఉద్యోగ సంఘాలు, అర్చక సంఘాలు, కాంట్రాక్టు ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు.
మాటిచ్చిండు.. వెలుగులు నింపిండు
హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, నేతలు ఎన్నో ఏండ్ల నుంచి ఆశగా ఎదురు చూస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారందరినీ క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ వారి జీవితాల్లో వెలుగులు నింపారని పలువురు ఉద్యోగులు పేర్కొన్నారు. మల్లేపల్లి ఐటీఐలో తెలంగాణ కాంట్రాక్టు ఏటీవోల సంఘం సభ్యులు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఫైల్పై సంతకం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పారిశ్రామిక శిక్షణ సంస్థలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు సహాయ శిక్షణాధికారుల కుటుంబాలు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాయని ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లంబు సుధాకర్రెడ్డి పేర్కొన్నారు.
సాగర్లో అలరించిన నమూనా
సచివాలయం నమూనాతో హుస్సేన్ సాగర్లో భగీరథ బోటు చక్కర్లు కొట్టింది. బీఆర్ఎస్ జెండాలు ధరించి బోటుకు ఒక వైపు నూతన సచివాలయం ఫొటో ఏర్పాటు చేసి సాగర్లో నలుదిక్కులా చక్కర్లు కొడుతూ కనులవిందును పంచింది. సచివాలయ నమూనాతో తిరుగుతున్న బోటును చూసి నగరవాసులు ఫొటోలు తీసి సంతోషం వ్యక్తం చేశారు.
ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలన
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం. ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయాన్ని ప్రారంభించడం హర్షణీయం. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన సాగుతోంది. సీఎం కేసీఆర్ ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నరు. ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నరు. సువిశాల నిర్మాణంతో భవనాన్ని అతి తక్కువ సమయంలో నిర్మించడమనేది సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం.
– మైనంపల్లి హన్మంతరావు, మల్కాజిగిరి ఎమ్మెల్యే
కేసీఆర్కు కాంట్రాక్టు ఉద్యోగుల కృతజ్ఞతలు
నూతన సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ తొలి సంతకం చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీలోని దాదాపు 200 మంది కాంట్రాక్టు కోచ్లుగా పనిచేస్తున్న తమ జీవితాల్లో సీఎం వెలుగులు నింపిండు. ముఖ్యమంత్రి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ తొలి సంతకం చేయడం పట్ల తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కోచ్లు హర్షం వ్యక్తం చేస్తున్నరు.
– ఓంకార్ యాదవ్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కాంట్రాక్ట్ కోచ్
‘పార్లమెంట్’కు అంబేద్కర్ పేరు పెట్టాలి
ఢిల్లీలోని నూతన పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టాలి. తెలంగాణ నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు నామకరణం చేసి, అట్టహాసంగా 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. అంబేద్కర్ నూతన సచివాలయాన్ని ప్రారంభించడం చారిత్రాత్మక ఘట్టం.
– గుండె రమేశ్చంద్ర,మాదిగ సంక్షేమ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు
ఉద్యోగుల క్రమబద్ధీకరణపై హర్షం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం సీఎం కేసీఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఫైలుపై సంతకం చేయడం హర్షణీయం. 25 ఏండ్లుగా ఎదురుచూస్తున్న తమ కలను సాకారం చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, వి.శ్రీనివాస్గౌడ్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు.
ఇది సంక్షేమ ప్రభుత్వం
ఇచ్చిన మాట ప్రకారం నూతన రాష్ట్ర సచివాలయం ప్రారంభం సందర్భంగా సీఎం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఫైల్పై తొలి సంతకం చేయడం హర్షణీయం. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు తీపి కబురు అందించారు. మాట నిలబెట్టుకున్న సీఎంగా చరిత్రలో నిలుస్తారు. –కర్నాటి సాయిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు,తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం-హెచ్-1
అంబేద్కర్ పేరు పెట్టడం హర్షణీయం..
రాష్ట్ర నూతన సచివాలయానికి డాక్టర్ బీఆర్.అంబేద్కర్ పేరు పెట్టడం అపూర్వమైన ఘట్టమని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్పర్సన్, బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య పేర్కొన్నారు. నూతన సచివాలయానికి డాక్టర్ బీఆర్.అంబేద్కర్ పేరు పెట్టి ప్రారంభించిన సందర్భంగా ఈసీఐఎల్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్, సింగరేణి, ఈసీఐఎల్ ఎస్సీ, ఎస్టీ దళిత సంఘాలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.