‘కాంగ్రెసోళ్లు ఎన్నికల్లో గెలుపు కోసం చెయ్యని లాలూచీ పనులు లేవు. ఎన్ని అడ్డమైన కుట్రలు చేయాల్నో అన్నీ చేస్తున్నరు. ఈ యాసంగికి రైతుల ఖాతాల్లో పడాల్సిన రైతుబంధును ఎయ్యకుంట కాంగ్రెసోళ్లు ఆపిండ్రు. మీ ఖాతాల్లో పడాల్సిన రైతు బంధును పడకుండా అడ్డుకున్న కాంగ్రెస్కు మద్దతిస్తే మీ కొంప గూడా కొల్లారం కాదా ..?’ అని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అన్నారు.
రంగారెడ్డి జిల్లా పరిధిలోని షాద్నగర్, చేవెళ్ల నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, కాలె యాదయ్యకు మద్దతుగా సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెసోళ్లు గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తమని గొప్పగ చెప్తున్నరు.
ఇందిరమ్మ రాజ్యంల ఎన్ని అరాచకాలు జరిగినయ్..? ఎంత మందిని కాల్చి చంపిండ్రు..? ఎమర్జెన్సీ పెట్టి ఎంత మందిని జైళ్లల్ల పెట్టిండ్రు..? అసుంటి ఇందిరమ్మ రాజ్యం మళ్ల కావాల్నా ..? పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రంలో మళ్ల దరిద్రపు రోజులే వస్తయ్ అని అన్నారు. పాలమూరు ప్రాజెక్టుపై కాంగ్రెసోళ్లే 196 కేసులు పెట్టి, పదేండ్లు ఆలస్యం చేశారన్నారు. పాలమూరు నుంచి ఫస్ట్ నీళ్లు చేవెళ్లకే వస్తాయని చెప్పారు. మళ్లీ అధికారంలోకి రాగానే.. తొలి కేబినెట్ భేటీలోనే అసైన్డ్ భూములకు పట్టాలిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ కుట్రలను గుర్తెరిగి ఎన్నికల్లో ఓడగొట్టాలని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి దీవించాలని సీఎం కేసీఆర్ కోరారు.