పెన్పహాడ్, మే 20: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సీఐ కుటుంబానికి అతని బ్యాచ్మేట్స్ ఆర్థిక సహాయం చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. హైదరాబాద్లోని సుల్తాన్బజార్ పోలీస్స్టేషన్లో సీఐగా విధులు నిర్వర్తిస్తున్న సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం అన్నారం వాసి సుందరి లక్ష్మణ్, అతని భార్య ఝాన్సీ ఈ నెల 8న హైదరాబాద్ శివారుఅబ్దుల్లాపూర్మెట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. వారి కూతురు ఆకాంక్ష, కొడుకు కుశలవ్ ఒంటరి వారయ్యారు. గురువారం అన్నారంలో జరిగిన దశదినకర్మ కార్యక్రమంలో లక్ష్మణ్ బ్యాచ్మేట్స్ పాల్గొని నివాళులర్పించారు. ఉమ్మడి రాష్ర్టానికి చెందిన 1,100 మంది బ్యాచ్మేట్స్ నుంచి సేకరించిన రూ.35 లక్షల చెక్కును చిన్నారులకు అందజేశారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు లక్ష్మణ్ మిత్రులు, సహచరులు ఆసరాగా నిలువడాన్ని గ్రామస్తులు అభినందించారు.