‘కాంగ్రెస్ హయాంలో తెలంగాణ అంటేనే కరువు ప్రాంతం. చెరువులల్ల చుక్క నీరు లేకపోతుండె. 1000 ఫీట్ల బోర్లు వేయాల్సి వస్తుండె. రైతుల ఆత్మహత్యలు.. చేనేతల ఆకలి చావులు.. ఇటువంటి నమూనాలు ఎన్ని చూసినం. కాంగ్రెస్ రాజ్యంలో గొడగొడ ఏడ్సినం.. ఎవడన్న పట్టించుకున్నడా..? అదే ఇవాళ పంజాబ్ను తలదన్ని 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తున్నాం. పంట కోయడానికి వరికోత మిషన్లు, ధాన్యం పట్టనీకే గిర్నీలు సరిపోతలేవు. హెలికాప్టర్లో పోతుంటే మొత్తం వడ్ల కుప్పలే కనపడుతున్నాయి.’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షతన జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లారాజేశ్వర్రెడ్డికి మద్దతుగా చేర్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
పచ్చబడ్డ తెలంగాణను కిందికిపోయేటట్టు.. దళారీ రాజ్యం వచ్చేటట్టు చేస్తమని బాజాప్తా కాంగ్రెసోళ్లు చెబుతున్నరు. ధరణిని తీసేస్తమని, రైతుబంధు దండగని, 3 గంటల కరెంట్ సరిపోతదని చెబుతున్నరు. తెలంగాణ అంత అలకగా ఉన్నదా ? పాలిచ్చే బర్రెను అమ్మి దున్నపోతును తెచ్చుకుంటరా ? కరువు తెచ్చిన కాంగ్రెస్ కావాలా ? బతుకునిచ్చిన బీఆర్ఎస్ కావాలా ? ఎవరికి పిండం పెట్టాల్నో ప్రజలే నిర్ణయించాలె. కేంద్రంలో ఉన్న మోడీ సర్కారు.. ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యలె.. ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలె.. మరి బీజేపీకి ఒక్క ఓటు ఎందుకు వేయాలె ? గోల్మాల్ కావొద్దు… ఆలోచించి ఓటేయాలి. ఉద్యమంలో వెంట నడిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డిని భారీ మెజారిటీతో దీవించండి. చేర్యాలలో కరువు దరి చేరకుండా చూసే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసానిచ్చారు.