విద్వేష రాజకీయాలను తిప్పికొట్టాలి
జాతీయ స్థాయి మోడల్గా ఎల్బీనగర్ నియోజకవర్గం
టీఆర్ఎస్ వనస్థలిపురం సమావేశంలో ఎమ్మార్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి
వనస్థలిపురం, జూలై 3: రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతోందని ఎమ్మార్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ వనస్థలిపురం డివిజన్ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ అధ్యక్షుడు చింతల రవికుమార్ అధ్యక్షతన ఆదివారం జరిగింది. సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత సమూలమైన మార్పులు రాష్ట్రంలో వచ్చాయన్నారు. నిరంతర విద్యుత్, మిషన్ బగీరథ ద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా స్వచ్ఛమైన నీరు అందిస్తున్నామన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని జాతీయ స్థాయి మోడల్గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. సిగ్నల్ ఫ్రీ రహితంగా మారిన ఎల్బీనగర్ చౌరస్తా, డ్రైనేజీ వ్యవస్థ, పతుల్ల గూడ శ్మశాన వాటిక, హరిణ వనస్థలి వద్ద బస్ టెర్మినల్లు దానికి అద్దం పట్టనున్నాయన్నారు.
ప్రజల మధ్య విద్వేశాలు రేపి రాజకీయాలు చేసేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎల్బీనగర్లో ఏం చేస్తారో చెప్పకుండా కొంతమంది నాయకులు తనపై విమర్శలకు దిగుతున్నారన్నారు. గొప్ప విజన్తో పనిచేస్తున్న తనను వ్యక్తిగతంగా కాకుండా ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలని సూచించారు. బీజేపీ పాలనలో దేశం ఓ తరం వెనకకు నెట్టివేయబడిందన్నారు. రూపాయి విలుగా దారుణంగా పడిపోతోందని, నిత్యావసరాలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. శాంతియుతంగా ఉన్న దేశాన్ని నిట్టనిలువునా చీల్చే మత రాజకీయాలను ఎండగట్టాలని సూచించారు. ఎంతో ఇమేజ్ ఉన్న మన నగరాన్ని, శాంతి భద్రతలను పరిరక్షించుకోవాలని, అలజడులు సృష్టించేవారిని సహించవద్దన్నారు. కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని వారికోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్రెడ్డి, నాయకులు కుంట్లూర్ వెంకటేశ్గౌడ్, లగ్గోని శ్రీధర్గౌడ్, చాపల శ్రీనివాస్ యాదవ్ సంజయ్కుమార్, వేములయ్యగౌడ్, మధుగౌడ్, కైసర్, గడల రాజునాయీ, లత ఆనంద్రాజ్, అజయ్యాదవ్, నవీద్, మదబ్బీర్, కిరణ్, రామేశ్వరమ్మ, వెన్నెల, రవీందర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఆటోనగర్ డంపింగ్ యార్డు స్థలంలో అందమైన ఫ్లవర్ గార్డెన్
మన్సూరాబాద్, జూలై 3: ఆటోనగర్ పాత డంపింగ్ యార్డు రూపురేఖలు మార్చి, అందమైన ఫ్లవర్ గార్డెన్గా తీర్చిదిద్దే ప్రక్రియను ప్రారంభించామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి ఆటోనగర్ డంపింగ్ యార్డు సమీపంలోని హరిణ వనస్థలి నేషనల్ పార్కులోకి వ్యర్థాలను వదులుతున్నారన్న పరిసర కాలనీవాసుల ఫిర్యాదు మేరకు ఆదివారం మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డితో పాటు సంబంధిత అధికారులతో కలిసి సదరు ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటోనగర్ జాతీయ రహదారిలోని హరిణ వనస్థలి నేషనల్ పార్కు వద్ద బస్బే నిర్మాణం కోసం ఎకరంన్నర స్థలం ఇచ్చేందుకు అటవీశాఖ అధికారులు అంగీకరించారని తెలిపారు. ఎకరంన్నర స్థలం ఇస్తున్నందుకు ప్రత్యామ్నాయంగా ఆటోనగర్ డంపింగ్ యార్డు ప్రాంతంలో అటవీశాఖకు మూడు ఎకరాల స్థలాన్ని అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక హంగులతో బస్ టెర్మినల్ను నిర్మించే పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆటోనగర్ డంపింగ్ యార్డులో మిగిలిన 39 ఎకరాల స్థలంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన మొక్కలతో ఫ్లవర్ గార్డెన్ను నిర్మిస్తామని తెలిపారు. ఆటోనగర్ నుంచి పాత పోచంపల్లి మార్గంలో ఉన్న పాత రోడ్డు పునరుద్ధరణ విషయంపై ఇటీవల అటవీశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడటం జరిగిందని.. త్వరలోనే రోడ్డు పునరుద్ధరణకు అనుమతులు లభిస్తాయని తెలిపారు.
ఫారెస్ట్ భూముల్లోకి.. వ్యర్థాలను వదులుతున్న వారిపై చర్యలు
ఆటోనగర్ డంపింగ్ యార్డు సమీపంలోని అటవీశాఖ భూముల్లోకి కొందరు ట్యాంకర్లను తీసుకువచ్చి రాత్రి సమయాల్లో రసాయన వ్యర్థాలను వదులుతున్నట్లు స్థానికులు ఫిర్యాదు చేశారని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడి తెలిపారు. వ్యర్థాల డంపింగ్ను అరికట్టేందుకు ఈ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆటోనగర్ ఐలా కమిషనర్ను కోరామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా డీఎఫ్ఓ జానకీరాం, డీసీ మారుతీ దివాకర్, బాలాజీనగర్ కాలనీ అధ్యక్షుడు దుర్గెంపూడి సాంబిరెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, కర్మన్ఘాట్ హనుమాన్ టెంపుల్ చైర్మన్ పోచబోయిన ఈశ్వరమ్మయాదవ్, మాజీ అధ్యక్షులు టంగుటూరి నాగరాజు, పోచబోయిన జగదీశ్యాదవ్, నాయకులు మార్గం రాజేశ్, సంతోష్ గుప్త, చెంగల్ చంద్రమోహన్, విజయ భాస్కర్రెడ్డి, కె.వెంకటాచార్యులు, ఏలుకొండ రాంకోటి, సిద్దగోని జగదీశ్గౌడ్, అంజయ్యగౌడ్, గోపీకృష్ణారెడ్డి, భాస్కర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.