జీడిమెట్ల, ఆగస్టు 1: టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ పాలన కొనసాగుతున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆధ్వర్యంలో మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి క్షీరాభిషేకం చేసి మిఠాయిలు పంచి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర మరవలేనిదని, కార్మికుల కష్టాలు, సాదక బాదకాలు తెలిసిన మహామనిషి ముఖ్యమంత్రి అని కొనియాడారు. వేలాది మంది కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మానవీయతను చాటుకుందని, సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అని అన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల నాటి కల నెరవేరిందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం గొప్ప విషయమని.. ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలకు నోటిమాట రావడం లేదని.. పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు. అంతకు ముందు జీడిమెట్ల డిపోలో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి బీఆర్ఎస్ నేత, మాజీ కార్పొరేటర్ జి.సురేశ్రెడ్డి క్షీరాభిషేకం చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ విజయ్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ సునీత, జీడిమెట్ల డిపో అధ్యక్షుడు రాపోలు గోవర్ధన్, రాజేందర్ రెడ్డి, ఖదీర్, అఫ్జల్, వెంకట్ రెడ్డి, జీ.ఆర్.పీ రెడ్డి, మల్లేశ్, కుమారస్వామి, రాజు, వెంకట్, బీఆర్ఎస్ నాయకులు పోలే శ్రీకాంత్, రాజు, శంకరయ్యతో పాటు కార్మికులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
మరింత ఉత్సాహంతో పని చేస్తాం
ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల కోసం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో చారిత్రాత్మకం. సంస్థ ఉద్యోగులుగా కాకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్నీ గుర్తించడం చాలా ఆనందంగా ఉంది. ఆర్టీసీ అభివృద్ధి కోసం డ్రైవర్లు, కండెక్టర్లు మరింత రెటింపు ఉత్సాహంతో పని చేస్తాం.
– ఆర్.గోవర్ధన్, జీడిమెట్ల డిపో అధ్యక్షుడు
సీఎం కేసీఆర్కు రుణ పడి ఉంటాం
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు కార్మికులుగా ఉన్న డ్రైవర్లు, కండెక్టర్లు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటారు. సీఎం కేసీఆర్ నిర్ణయం వల్ల ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నిండుతాయి. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు సీఎం కేసీఆర్కు ఎంతో రుణపడి ఉంటారు.
– ఎండీ ఖదీర్, జీడిమెట్ల డిపో కండెక్టర్