నిన్నటి వరకు రెవెన్యూ సహాయకులుగా ఉన్న వారంతా నేడు ప్రభుత్వ ఉద్యోగులయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ గురువారం నియామక పత్రాలను అందించారు. రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి హైదరాబాద్ జిల్లాకు చెందిన 66 మంది వీఆర్ఏలకు ప్రభుత్వ ఉద్యోగులుగా నియామక పత్రాలను అందజేశారు.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో మంత్రి మల్లారెడ్డి 131 మందికి ప్రభుత్వ ఉద్యోగులుగా నియామక పత్రాలు అందజేశారు. వీఆర్ఏల విద్యార్హతల ఆధారంగా వారిని మిషన్ భగీరథ, ఇరిగేషన్ వంటి వివిధ శాఖలకు కేటాయించారు. ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామ సేవకులుగా ఉన్న వీఆర్ఏలకు సర్కారు కొలువులు రావడంతో వారంతా ఉబ్బితబ్బిబ్బయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని ధన్యవాదాలు తెలిపారు.
సిటీబ్యూరో, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : గ్రామ సేవకులుగా ఉన్న వీఆర్ఏలకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపునిచ్చి వారి ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్లో హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి జిల్లా పరిధిలోని వివిధ శాఖలకు కేటాయించబడిన 66 మంది వీఆర్ఏలకు నియామక పత్రాలను మంత్రి తలసాని అందజేశారు. ఎన్నో ఏండ్లుగా గ్రామ సేవకులుగా సేవలందిస్తున్న రాష్ట్రంలోని వీఆర్ఏలందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించామన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో వారి విద్యార్హతల ఆధారంగా జూనియర్ అసిస్టెంట్, హెల్పర్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ తదితర కేటగిరిల్లో నియమించామని మంత్రి వివరించారు. హైదరాబాద్ జిల్లాకు మొత్తం 182 మందిని కేటాయించారని, వీరిలో 40 మంది జిల్లాకు చెందిన వారు కాగా, 26 మంది మెదక్, 62 మంది కామారెడ్డి, 17 మంది జనగాం, 37 మంది మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలకు చెందిన వీఆర్ఏలు ఉన్నారని తెలిపారు. నూతనంగా నియమితులైన వారికి మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, ప్రభాకర్ రావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, కౌసర్ మొహినుద్దీన్, మౌజంఖాన్, ముంతాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్, ఆగస్టు10(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండటం ప్రభుత్వ ఉద్యోగుల అదృష్టమని, నూతనంగా నియామకమైన వీఆర్ఏలు విధులు సక్రమంగా నిర్వహించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లోని సమావేశం హాలులో గురువారం నిన్నటి గ్రామ రెవెన్యూ సహాయకులు-నేటి ప్రభుత్వ ఉద్యోగులు కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 131 మంది వీఆర్ఏలకు మంత్రి, జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గ్రామ రెవెన్యూ సహాయకులుగా విధులు నిర్వహించిన సమయంలో రూ.11.500 వేతనం ఉందన్నారు. ప్రస్తుతం వీఆర్ఏలుగా ప్రభుత్వంలో విలీనం చేయడంతో ప్రభుత్వ ఉద్యోగాలకు సమానంగా వేతనం, ఇతర సౌకర్యాలు, వసతులు కల్పించనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా వారి విద్యార్హతల ఆధారంగా వివిధ శాఖల్లో భర్తీ చేసినట్లు జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ తెలిపారు. జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, హెల్పర్లుగా నియమిస్తూ ప్రభుత్వం జీవోను జారీ చేసిందన్నారు. జిల్లాలో ప్రస్తుతం 131 మంది గ్రామ రెవెన్యూ సహాయకులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశామని పేర్కొన్నారు. ఇందులో 72 మందికి రెవెన్యూశాఖ, ఎంఏయూడీ శాఖకు 6, ఇరిగేషన్శాఖకు 22, మిషన్ భగీరథలో 30, స్టేట్ పన్నుల శాఖ -ఒక్కరిని కేటాయించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్రెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, కలెక్టరేట్ ఏవో రామ్మోహన్, తాసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.