“ఇందిరమ్మ రాజ్యం అంటేనే దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం.. ఎవరు ఏం చేసిండ్రు.. ఎవరి చేతిలో అధికారం ఉంటే ఏం చేస్తరు. ఎవరు ప్రజల కోసం పాటు పడుతరు అనేది ఆలోచించి ఓటు వేయాలి” అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సోమవారం నకిరేకల్ నియోజకవర్గం అభ్యర్థి చిరుమర్తి లింగయ్య, నల్లగొండ నియోజకవర్గం అభ్యర్థి కంచర్ల భూపాల్రెడ్డిలకు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రసంగించారు.
“కరెంట్ మంచిగా ఇస్తున్నాం. ధాన్యం కొంటున్నాం. కానీ ఇవాళ కాంగ్రెస్ మాటలు వింటుంటే వారి పాలన గుర్తుకు వస్తుంది. మంచినీళ్లు లేవు, సాగునీళ్లు లేవు, కరెంటు లేదు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రైతుల ఆకలి చావులు ఇదే వారి 50 ఏండ్ల పాలన చరిత్ర. ఏదీ సక్కగ లేకుండే. కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉండే తెలంగాణకు మంచినీళ్లు కూడా ఇయ్యలేక పోయిండ్రు. మరి ఇయ్యాల కరెంటు ఎట్ల వచ్చింది.. మంచినీళ్లు ఎట్ల వచ్చినయ్. అప్పుడెట్లుండే.. ఇప్పుడెట్లుంది.. ఆలోచన చేయాలి.
కాంగ్రెస్ నాయకుల మాటలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ధరణి తీసేస్తాం., రైతు బంధు వేస్ట్., రైతులకు మూడు గంటల కరెంటు చాలు, 10 హెచ్పీ మోటర్లు కొనుక్కోవాలని చెబుతున్నరు. ఇది సీరియస్ విషయం. మీ భూముల మీద మీకే హక్కులు ఉండాలని ధరణి తీసుకువచ్చాం.. కాంగ్రెసోళ్లు భూమేత తీసుకువచ్చి మీ హక్కులు ఊడగొడుతమంటున్నరు. మళ్లీ దళారుల రాజ్యం, పైరవీకారుల రాజ్యం తెస్తరట.. జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అవ్వే పాతరోజులు వస్తయ్. ఓటు మీ తల రాత రాస్తది.. మీ భవిష్యత్ను నిర్ణయిస్తది. పనికిమాలిన వారికి ఓటు వేస్తే.. మనకు పనికిమాలిన ప్రభుత్వమే వస్తది. నల్లగొండకు ఐటీ టవర్ వచ్చింది.. 1500 మందికి ఉద్యోగాలు దొరుకుతున్నయ్.. ఇవాళ ఇంత మంచిగా అభివృద్ధి జరుగుతున్నది. ఈ అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లో జారవిడుచుకోవద్దు. మీరు ఊహించనంత అభివృద్ధి చేసి చూపెడుతాం.” అని ముఖ్యమంత్రి కేసీఅర్ అన్నారు.