బేగంపేట్ (హైదరాబాద్) : ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ(Minister Mahamood Ali) అన్నారు. శనివారం నల్లగుట్టలోని జియాఫుల్ ఇస్లాం హైస్కూల్లో కంప్యూటర్ ల్యాబ్తో పాటు విద్యార్థులకు ఉచితంగా న్యూట్రిషన్(Nutrition) కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి విద్యార్ధికి నాణ్యమైన ఉచిత విద్యను అందించాలనే లక్ష్యంతో రెసిడెన్షియల్(Residential) పాఠశాలలను ప్రారంభించారని తెలిపారు. ముస్లిం మైనార్టీలకు కూడా అనేక పథకాలను ప్రవేశ పెట్టడంతో పాటు వారు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అనేక పథకాలు ప్రవేశ పెట్టారని అన్నారు. సుల్తాన్ ఎడ్యుకేషన్ సొసైటీ పాఠశాలకు కంప్యూటర్లను బహుకరించడం పట్ల హోంమంత్రి అభినందించారు.
పేద విద్యార్ధులకు సొసైటీ ద్వారా అతి తక్కువ ఫీజులతో విద్యను అందించడంతో పాటు ఉచితంగా బ్రేక్ ఫాస్ట్ను అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు జాఫర్ జావీద్ జియా ఉల్, ఇస్లామిక్ సొసైటీ కార్యదర్శి ఖాదర్ షేక్, ఉపాధ్యక్షులు సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.