సిటీబ్యూరో, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ); నిరుపేదలు సొంతింటి కల నెరవేర్చాలి… పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న సంకల్పంతో డబుల్ బెడ్రూం ఇండ్లకు శ్రీకారం చుట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. గేటెడ్కు దీటుగా..రూపాయి ఖర్చు లేకుండానే పేదోడికి విశాలమైన ఇంటిని నిర్మించి.. ఉచితంగా అప్పగిస్తున్నది.
ఈ డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం దేశంలోనే ఆదర్శవంతమైన ప్రాజెక్టుగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. జీహెచ్ఎంసీ పరిధిలో 111 లొకేషన్లలో 2015లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చేసింది. ఒకటి, రెండు ప్రాంతాలు మినహా అన్ని చోట్ల నిర్మాణ పనులను పూర్తి చేయగా, ఇటీవల మూడు విడతల్లో సుమారు 70 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను అత్యంత పారదర్శకంగా అర్హులకు అందజేసింది.
సామాజిక వసతులకు ప్రత్యేక ఏర్పాట్లు
కాలనీవాసులకు ఆహ్లాదకరంగా ఉండేందుకు పార్కు, సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ ప్లే గ్రౌండ్, ఓపెన్ జిమ్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఓపెన్ స్పోర్ట్స్ ఏరియా, కిడ్స్ ల్లాట్ టట్స్, మల్టీపర్పస్ గ్రౌండ్ , అంపీ థియేటర్, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం, బతుకమ్మ ఘాట్ ఏర్పాటు చేశారు. కాలనీ వాసులకు ఆధునిక కూరగాయలు, మాంసాహార మార్కెట్ ఏర్పాటు, ప్లే స్కూల్, అంగన్వాడీ సెంటర్, బస్తీ దవాఖాన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఉన్నత పాఠశాల, బస్ టర్మినల్, బస్టాప్, పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్, మిల్క్బూత్లు, పెట్రోల్ బంకులు, పోస్టాఫీసు, ఏటీఎం బ్యాంక్ ఏర్పాటు చర్యలు చేపట్టారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యార్డును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
మరో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు
మూడోసారి అధికారంలోకి రాగానే నగరంలో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టించి ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. కాగా, ఇప్పటి వరకు ప్రభుత్వం 70 వేల మందికి డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయగా, ఎన్నికల కోడ్ కారణంగా మిగిలిన ఇండ్ల పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నదని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకం కొనసాగుతుందని, నగరంలో అదనంగా మరో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి..పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. గ్రేటర్లో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయని, వాటిలో గృహాల నిర్మాణం చేపట్టి అందిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
పేరుకే జేఎన్ఎన్యూఆర్ఎం
గత ప్రభుత్వాల హయాంలో జేఎన్ఎన్యూఆర్ఎం పథకం ద్వారా నగరంలో మూడు దశల్లో మొత్తం 46, 629 గృహాల నిర్మాణానికి రూ.1088.55 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. గ్రేటర్ పరిధిలో 45,951 గ్రౌండ్ చేశారు. అందులో 31, 187 గృహాలు రూ. 725.55కోట్ల వ్యయంతో పూర్తయ్యాయి. అందులో 17, 546 మంది లబ్ధిదారులకు గృహాలను పంపిణీ చేశారు. మరో 13, 641 ఇండ్ల కోసం ప్రజలు ఆసక్తి చూపడంతో ఖాళీగా ఉంచారు. 2014లో 14,076 గృహాలను రూ. 204.41కోట్ల వ్యయంతో పూర్తి చేయగా..ఈ పథకం ద్వారా నిర్మించిన గృహాల్లో కేవలం 26,063 ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గత ప్రభుత్వాలు నాసిరకంతో జేఎన్ఎన్ఆర్ఎం ఇండ్లను నిర్మించడమే ఇందుకు కారణమన్న ఆరోపణలు బలంగా వినిపించాయి.
దేశంలోనే అతిపెద్ద డిగ్నీటీ హౌసింగ్ కాలనీ..
ఉమ్మడి పాలనలో పేదల కోసం నిర్మించిన ఇండ్లు ఇరుకుగా.. అగ్గిపెట్టెల్లా ఉండేవి. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పడక గదుల ఇండ్లు కార్పొరేట్ స్థాయిలో నిర్మించి.. పేద ఆత్మగౌరవాన్ని రెట్టింపు చేసింది. ఒక టౌన్షిప్ను తలపించే విధంగా కొల్లూరులో అతి పెద్ద గృహ సముదాయ నిర్మాణం దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధి రామచంద్రాపురం మండలం కొల్లూరు గ్రామంలో రెండో దశ కింద చేపట్టిన కేసీఆర్నగర్ 2బీహెచ్కే డిగ్నిటీ హౌసింగ్ కాలనీగా సకల హంగులతో అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే హడ్కో అవార్డు వరించింది. వీటితో పాటు మరిన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు ఈ ప్రాజెక్టుకు వరించాయి. రాష్ట్ర ప్రభుత్వ దృఢ సంకల్పం, ఉన్నతస్థాయి అధికారులు, మంత్రుల పర్యవేక్షణ, నిర్మాణ సంస్థ ప్రతినిధుల చిత్తశుద్ధి ఫలితంగానే కొల్లూరు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్ట్లో మూడు షిప్ట్లకు గానూ 6వేల మంది కార్మికులు పనిచేయగా..500 మంది స్టాఫ్ ఉద్యోగులు నిర్మాణ పనులను పర్యవేక్షించారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి మంత్రి కేటీఆర్.. ఈ ప్రాజెక్ట్ను అనేకసార్లు సందర్శించి.. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇంటి విస్తీర్ణం 560 చదరపు అడుగులు..
ఒక హాల్, రెండు పడక గదులు, వంట గది, రెండు మరుగుదొడ్లు గల డబుల్ బెడ్రూం ఇంటి విస్తీర్ణం 560 చదరపు అడుగులు కాగా, ఒక్కో ఇంటికి రూ. 8.65 లక్షలు ఖర్చు చేసి.. పేదలకు బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.40 లక్షలకు పైగా విలువైన గృహాన్ని ఉచితంగా అందజేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అంతేకాకుండా ఈ గృహ సముదాయాల్లోనే షాపింగ్ కాంప్లెక్స్లను నిర్మించి.. వాటి ద్వారా వచ్చే అద్దెలను నిర్వహణకు ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించింది.
సకల సదుపాయాలతో..
జీహెచ్ఎంసీలో నివసించే నిరుపేదల కోసం 111 లొకేషన్లలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.9714.59 కోట్లు కాగా, అందులో 6,867 కోట్ల ఖర్చుతో 107 లొకేషన్లలో 97,341 ఇండ్ల నిర్మాణ పనులను పూర్తి చేసి.. సుమారు 70వేల ఇండ్లను అర్హులకు పంపిణీ చేశారు. నాలుగు లొకేషన్లలో 2,659 ఇండ్ల పనులు కొనసాగుతున్నాయి. కాగా, ఈ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం వెకెంట్ ల్యాండ్…అంటే..గతంలో ఉన్న ఇన్సీటు ప్రదేశాల్లో ఇండ్లను తొలగించి కొత్త నిర్మాణాలు చేపట్టారు. అప్పటి వరకు ఇరుకైన బస్తీల్లో ఉండే ప్రజలను ఒప్పించి.. అక్కడి నుంచి ఖాళీ చేయించి.. సకల సదుపాయాలతో అపార్ట్మెంట్ నిర్మాణాలు చేపట్టారు. సకల సౌకర్యాలతో ప్రతి గృహంలో రెండు బెడ్రూంలు, ఒక కిచెన్, రెండు మరుగుదొడ్లతో మొత్తం 560 స్కేర్ ఫీట్లలో నగరం మధ్యలోనే కార్పొరేట్ స్థాయి ఇంటిని అందజేశారు.
కేసీఆర్నగర్ ప్రాజెక్టు విశేషాలు
ప్రాజెక్టు వ్యయం రూ. 1489.50 ఎకరాలు
ఒక్కో ఇంటి వ్యయం మౌలిక
సదుపాయాలతో – రూ. 8.65 లక్షలు
(ఇంటికి రూ.7.90 లక్షలు, మౌలిక సదుపాయలకు రూ. 0.75 లక్షలు), కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షలు మాత్రమే.
ఇప్పటి వరకు చేసిన ఖర్చు – రూ. 1474.75 కోట్లు
మొత్తం బ్లాక్లు – 117
డబుల్ బెడ్రూం ఇండ్లు -15, 660
బిల్డప్ ఏరియా – 660 చదరపు అడుగులు
కార్పెట్ ఏరియా- 398 చదరపు అడుగులు
నిర్మాణం – స్టిల్ట్ +9, 10, 11 అంతస్తులుగా..
నిర్మాణాలు ప్రారంభం – 22-2-2018
భూమి వినియోగం ఇలా..
మొత్తం 145.50 ఎకరాలు
గ్రీనరీ, ఓపెన్ ఏరియా 21.77 ఎకరాలు
ఇతర సౌకర్యాలకు 27.89 ఎకరాలు
పారులు, క్రీడా మైదానాలకు 13.42 ఎకరాలు
పబ్లిక్ బిల్డింగ్ ఏరియాకు 6.26 ఎకరాలు
ఓపెన్ పారింగ్ 2.32 ఎకరాలు
రోడ్లకు 32.56 ఎకరాలు
నివాస గృహాలకు 19.85 ఎకరాలు
ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కోసం 20 ఎకరాలు