సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ):మహారాష్ట్రీయులు కలిసిరావాలి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గులాబీమయమైన ఔరంగాబాద్ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మహారాష్ట్రలో కూడా తలాటీ (వీఆర్వో) వ్యవస్థను రద్దు చేస్తాం. ఇంకా తానాషాహీలు ఉండవు. తెలంగాణలో ఈ వ్యవస్థను పూర్తిగా తొలగించి రికార్డులన్నీ డిజిటలైజ్ చేశాం. ధరణి పేరుతో వ్యవస్థను రూపొందించాం.
మరాఠా గడ్డపై మరోసారి బీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టారు. ఔరంగాబాద్ పట్టణమంతా గులాబీమయం అయింది. జమింద మైదానంలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభకు ప్రజలు భారీగా హాజరయ్యారు. భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు ముఖ్య అతిథిగా హాజరై, ముందుగా వేదికపై మరాఠా మహనీయులకు నివాళులర్పించి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మహారాష్ట్రలో రైతు రాజ్యం రావాలని, దీని కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ పార్టీని మహారాష్ట్రీయులు దీవించాలని ఆయన కోరారు. అంబేద్కర్ పుట్టిన గడ్డపై దళితులకు దళితబంధు పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టరని ఆయన ప్రశ్నించారు. రైతులు, దళితులు అధికారంలోకి రావాలని, వారి కిస్మత్ను మార్చుకునే చట్టాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకుముందు సీఎం కేసీఆర్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే అభయ్పాటిల్, పలువురు మహారాష్ట్ర మైనార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం మరాఠా రచయిత ప్రదీప్ సోలంకి రచించిన ‘తెలంగాణ-మాఝా అనుభవ్’ (తెలంగాణ రాష్ట్రం- నా అనుభవాలు) పుస్తకాన్ని వేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. సభ జరుగుతున్నంత సేపు ‘దేశ్ కీ నేత కైసే హో.. కేసీఆర్ జైసా హో’ అంటూ నినాదాలు మారుమోగాయి.