‘కాంగ్రెస్ నేతలు తమ పార్టీ గెలిస్తే మళ్లీ ఇందిరమ్మ రాజ్యం తెస్తం అంటున్నరు. ఇందిరమ్మ రాజ్యం అంత దరిద్రపు రాజ్యం ఇంకోటి లేదు. ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ రోజులు వచ్చాయి. ఇందిరమ్మ రాజ్యంలోనే కదా ఎన్కౌంటర్లు, రక్తపాతం జరిగింది. తెలంగాణ కోసం ఉద్యమించిన 400 మందిని కాల్చి చంపిండ్రు. అసుంటి రాజ్యం మళ్ల గావాల్నా.. ?’ అని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రజలను ప్రశ్నించారు. వరంగల్లో మంగళవారం వరంగల్ ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాల బీఆర్ఎస్ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, దాస్యం వినయ్ భాస్కర్లకు మద్దతుగా జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు.
కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టి 58 ఏండ్లు మనలను గోస పెట్టిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అసమర్థ పాలనతోనే వరంగల్లో తాగునీటి కరువు ఏర్పడిందని, నిజాంకాలంలో పెట్టిన అజాంజాహీ మిల్లును అమ్మేసిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. బీఆర్ఎస్ పాలన వచ్చాకే వరంగల్లో అభివృద్ధి ప్రారంభమైందని, ఏడాది, రెండేండ్లలో వరంగల్ టెక్స్టైల్ పార్కులో లక్షలాది మందికి ఉద్యోగాలు రాబోతున్నాయన్నారు.
ఈ వరంగల్ ఆకాశాన్ని ముద్దు పెట్టుకునేలా నిర్మిస్తున్న 24 అంతస్తుల మల్టీ స్పెషాలిటీ దవాఖాన రాష్ట్రంలోనే లేదన్నారు. మీరు పెంచినటు వంటి ఇద్దరు బీసీ బిడ్డలకు వరంగల్లో అవకాశం వచ్చిందని, బీసీలందరూ ఏకమై బీఆర్ఎస్ను గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.