‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు…కనీసం ఒక నవోదయ పాఠశాల ఇవ్వలేదు. వంద లేఖలు రాసినా నరేంద్రమోదీ ఒక్కటియ్యలె. మరి బీజేపీకి మనం ఒక్క ఓటు ఎందుకు వేయాలి. మనం ఏమన్న పిచ్చి పోసిగాళ్లమా..? మేం ఏం ఇవ్వకున్న మాకే గుద్దిండ్రు.. వీళ్లు గొర్రెలు అనుకుంటరు. మరి మనం గొర్రెలమా ? మనం ఎవరిమనేది 30 తారీఖున ఓటేసి నిరూపించాలి.’ అని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు అన్నారు.
ఎన్నికల ప్రచార పర్వంలో ఆఖరి రోజైన మంగళవారం సీఎం కేసీఆర్ తాను ప్రాతినిద్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ రాజ్యంలో ఊ అంటే.. ఆ అంటే.. మతకల్లోలం. మాట్లాడితే కర్ఫ్యూలు. 58 ఏండ్లు పడ్డ గోసలు గుర్తుకొస్తలేవా ? మంచినీళ్ల బాధలు మర్చిపోయామా ? కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రంలో పదేండ్ల నుంచి అభివృద్ధికి సహకరించకుండా, కుట్రలు చేస్తున్న కేంద్రానికి ఎందుకు సహకరించాలని ఆయన ప్రశ్నించారు.
పదేండ్లుగా రాష్ట్రంలో ఒక్క కర్ఫ్యూ లేదు… ప్రశాంత వాతావరణం ఉంది. ప్రతి యువకుడు ఆలోచించి విచక్షణతో ఓటేస్తే లాభం జరుగుతదని అన్నారు. తెలంగాణ తెచ్చిన కీర్తే తనకు ఆకాశమంత ఎత్తు అని, వందశాతం అక్షరాస్యత కలిగి, పేదరికం లేని రేపటి తెలంగాణ కోసమే నా పోరాటమని చెప్పారు. మరోసారి ప్రజలు ఆశీర్వదిస్తే.. గజ్వేల్ ప్రజల గౌరవాన్ని మరింత పెంచుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు.