అసెంబ్లీలోని సీఎం చాంబర్లో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తెలు లాస్యనందిత, నివేదిత, చిత్రంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, దానం నాగేందర్ తదితరులు
కంటోన్మెంట్, ఆగస్టు 3 : దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తెలు లాస్యనందిత, నివేదితలు గురువారం అసెంబ్లీలోని సీఎం చాంబర్లో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సాయన్న కూతుర్లను ఎంతో ఆప్యాయతగా పలకరించారు. సాయన్న భార్య ఆరోగ్యంతో పాటు కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి సాయ న్న లేని లోటు ఎంత ఉందో పార్టీకి కూడా అంతే ఉందని, కానీ నిబ్బరం కోల్పోకుండా ప్రజలతో మమేకమవ్వాలని సూచించారు. పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, కంటోన్మెంట్లో మరింత బలపడే విధంగా ముందుకు సాగాలని దిశా నిర్దేశం చేశారు.
ఉద్వేగానికి లోనయ్యాం..
తన తండ్రి గురించి సీఎం మాట్లాడుతుంటే ఎంతో ఉద్వేగానికి లోనైనట్లు దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతుర్లు లాస్యనందిత, నివేదితలు పేర్కొన్నారు.తమ తండ్రి రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి పేద ప్రజల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని, తండ్రి దూరమైన క్షణం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, తమకు పార్టీ అండగా నిలిచిందన్నారు. అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టగానే సభ్యులందరూ తమ తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకోవడం సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు.