సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ): సీఎం కప్ 2023 రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలు విజయవంతంగా ముగిసాయి. గ్రేటర్ హైదరాబాద్ వేదికగా ఒకేసారి 18 క్రీడా అంశాలలో భారీ ఎత్తున నిర్వహించిన పోటీల్లో సుమారు 1334 క్రీడాకారులు పాల్గొన్నారు. యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గచ్చిబౌలి, సికింద్రాబాద్ జింఖానా మైదానం తదితర వేదికలపై ఈ క్రీడాపోటీలు నిర్వహించారు. రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో హైదరాబాద్ పురుషుల జట్టు విజేతగా నిలిచింది.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి సీఎం కప్ 2023 షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీలను షూటింగ్ రేంజ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హాజరై షూటింగ్ విజేతలకు మెడల్స్ను అందజేశారు. గ్రేటర్ హైదరాబాద్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సీఎం కప్ 2023 ఛాంపియన్ షిప్ పోటీలకు 33 జిల్లాల నుంచి క్రీడాకారులు రావడం, ఒకేసారి 18 క్రీడా అంశాలతో మొట్టమొదటిసారి పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. ఈ పోటీల్లో సుమారు 1334 మంది క్రీడాకారులు రావడం.. అందులో పురుషులతో సమానంగా మహిళలు రావడం ఒక మహిళగా చాలా గర్వపడుతున్నానని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రీడలకు, క్రీడాకారులకు గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఎంతో ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. ఈ సమావేశంలో స్పోర్ట్స్ చైర్మన్ ముఖేశ్ కుమార్, జనరల్ సెక్రటరీ తెలంగాణ అసోసియేషన్ కిరణ్ కుమార్, మహబూబ్నగర్ ఆర్డీవో రాములు ,ఆర్గనైజర్ అలెగ్జాండర్ ఫ్రాన్సిస్ పాల్గొన్నారు.
క్రీడాకారులకు ప్రోత్సాహం : మంత్రి మల్లారెడ్డి
సికింద్రాబాద్ జింఖానా మైదానంలో నిర్వహించిన సీఎం కప్-2023 రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు బుధవారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రి మల్లారెడ్డి, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ హాజరై ఖోఖో పోటీలలో విజేతలైన క్రీడా జట్లకు మెడల్స్, నగదు బహుమతులను అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ… సీఎం కప్ క్రీడా పోటీల్లో ప్రథమ స్థానాల్లో నిలిచిన విజేతలకు వారు చదువుకునే విద్యా సంస్థల్లో ఫీజులో భారీ రాయితీ ఇస్తానని, ఈ అవకాశాన్ని విజేతలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ సుధాకర్, ఖోఖో అసోసియేషన్ సెక్రటరీ కృష్ణమూర్తి, ఇన్చార్జి సాయన్న, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.
క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తున్న సీఎం కేసీఆర్ ;శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి
ఆర్కేపురం, మే 31 : చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో గత నాలుగు రోజులు నిర్వహించిన సీఎం కప్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు బుధవారం ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డితో పాటు స్టోర్స్ అథారటీ ఆఫ్ చైర్మన్ ఆంజనేయ గౌడ్, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భరత్ హాజరయ్యారు.
తెలంగాణలో క్రీడలకు పెద్ద పీట ఎమ్మెల్యే మాగంటి
జూబ్లీహిల్స్, మే 31: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ క్రీడలకు పెద్దపీట వేస్తున్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బుధవారం యూసుఫ్గూడ కోట్లవిజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన సీఎం కప్- 2023 రెజ్లింగ్, బాస్కెట్బాల్ పోటీల విజేతలకు కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్తో కలిసి ఎమ్మెల్యే, సాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్, క్రీడల ఇన్చార్జి మేనేజర్ రవీందర్ బహుమతులు, కప్లు, మెడల్స్తోపాటు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి డీఆర్డీఓ ప్రభాకర్, సంగారెడ్డి డీవైఎస్ఓ రామచందర్, టెక్నికల్ అఫీషియల్స్, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.
బాస్కెట్బాల్, రెజ్లింగ్ పోటీల విజేతలు వీరే
రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో పి.విష్ణు, 86 కేజీల విభాగంలో సాహిల్ సింగ్, 65 కేజీల విభాగంలో ఎండీ.ఫ్రీద్ సాహిల్, 74 కేజీల విభాగంలో సయ్యద్ అబ్దుల్లా నాలుగు బంగారు పతకాలు హైదరాబాద్ జిల్లాకే దక్కాయి. మహిళల బాస్కెట్బాల్లో హైదరాబాద్పై మేడ్చల్- మల్కాజిగిరి, పురుషుల బాస్కెట్ బాల్లో మేడ్చల్ -మల్కాజిగిరిపై హైదరాబాద్ జట్టు విజయం సాధించాయి.