ఖైరతాబాద్, మే 20 : సామాన్యులకు మందులు అందుబాటు ధరల్లో లభించేలా మరిన్ని పరిశోధనలు అవసరమని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం సొసైటీ ఆఫ్ ఫార్మాస్యూటికల్ మెడిసిన్ అండ్ రీసెర్చ్, అడ్విటీ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్, క్లినోసోల్ సంయుక్తాధ్వర్యంలో నెక్లెస్రోడ్లోని జలవిహార్ వద్ద అంతర్జాతీయ క్లినికల్ ట్రయల్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వాక్థాన్ను ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్ భారత ప్రభుత్వ సీడీఎస్సీవో డిప్యూటీ డ్రగ్ కంట్రోలర్ డాక్టర్ రాంకిషన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వివిధ వ్యాధులకు సరైన ఔషధాలను అభివృద్ధి చేయడంలో క్లినికల్ రీసెర్చ్, క్లినికల్ ట్రయల్స్ చాలా ముఖ్యమన్నారు. దుష్పలితాలు లేని విధంగా మెరుగైన వైద్యం అందుబాటులో తేవడానికి కృషి చేయాలన్నారు. ఫార్మా, క్లినికల్ ట్రయల్స్ రంగంలో దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే హైదరాబాద్ ఒక ముఖ్యమైన కేంద్రంగా మారిందన్నారు. అనంతరం క్లినికల్ రీసెర్చ్లో విశేష సేవలందించిన నిమ్స్, గాంధీ, ఉస్మానియా వైద్య కళాశాలలు, భారత్ బయోటెక్కు చెందిన వైద్య నిపుణులు, పరిశోధకులను మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ అడిషనల్ ప్రొఫెసర్ డాక్టర్ సి. ప్రభాకర్రెడ్డి, టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్, వైద్యులు శ్రీనివాస్, శ్రీధర్, సదాశివుడు, సౌరిష్, మనీషా, శ్రీజిత్, సిన్హా తదితరులు పాల్గొన్నారు.