కందుకూరు, ఏప్రిల్ 14 : కందుకూరు కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి వ్యవహార తీరుపై మాజీ జడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డి మండిపడ్డారు. తనకు సమాచారం లేకుండా జడ్పీటీసీ బొక్క జంగారెడ్డిని పార్టీలోకి ఎలాతీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కూడా ఎమ్మెల్యే టికెట్ ప్రయత్నించానని.. అదృష్టం బట్టి మీకు టికెట్ వచ్చిందని.. అంత మాత్రన ఉలిక్కి పడడం తగదని పేర్కొన్నారు. ఆదివారం టంకిరి రాంరెడ్డి ఫంక్షన్ హల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం రసాబాసగా మారింది. నాయకులు, కార్యకర్తలు సమావేశంలో రచ్చరచ్చ చేశారు. మాజీ జడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డి మాట్లాడుతుండగా తమకు అవమానం జరుగుతుందని కందుకూరు మాజీ ఎంపీటీసీ సరికొండ పాండు అడ్డుపడ్డారు. దీంతో ఒక్కసారిగా సమావేశంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. నాయకులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు చేతులు వేసుకునే స్థాయికి పోయింది.
తనకు జరుగుతున్న అన్యాయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకుపోయానని, కేఎల్ఆర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పార్టీలో తనకు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని ద్వజమెత్తారు. రెండు రోజుల కింద పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని., ఎవరిని అడిగి జడ్పీటీసీ బొక్క జంగారెడ్డిని పార్టీలోకి తీసుకున్నారని ప్రశ్నించారు. ఎక్కువ శాతం కార్యకర్తలు, నాయకులు కేఎల్ఆర్పై అసహనం వ్యక్తం చేయడంతో సమావేశంలో గందరగోళం ఏర్పడింది. ఉప ఎంపీపీ గంగుల శమంత ప్రభాకర్రెడ్డి కూడా తనకు సమాచారం ఎందుకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఇన్చార్జి లక్ష్మారెడ్డి కల్పించుకొని తనకు అందరూసమానమేనని, కలిసి మెలిసి ఉందామని చెప్పి సమావేశం నుంచి వెళ్లి పోయారు. దీంతో పోలీసులు కలుగజేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. కాంగ్రెస్లో ఉన్న విభేదాలు బయటపడడంతో ఎంపీ అభ్యర్థిని ఎలా గెలిపిస్తారని పలువురు చర్చించుకున్నారు.