సిటీబ్యూరో, మే 8 (నమస్తే తెలంగాణ) : ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకొని వాటి గురించి మర్చిపోయిన వాటిని లక్ష్యంగా చేసుకొని ఆన్లైన్లో ఫోర్జరీ డాక్యుమెంట్లతో సరెండర్ చేస్తూ రూ.4 కోట్లు దోచేసిన ముఠాను రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం నేరెడ్మెట్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ డీఎస్ చౌహాన్ వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన కోసరాజు రంగసాయి హర్ష సికింద్రాబాద్లోని ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో కీ రిలేషన్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా ఇతడికి పాలసీదారులకు సంబంధించిన వివరాలు అందేవి.
కాలపరిమితి పూర్తయినవే టార్గెట్గా..!
కోసరాజు రంగసాయి హర్ష వద్దకు వచ్చే డేటాలో కొందరు పాలసీలు చేసి, దాని కాల పరిమితి పూర్తయి మెచురిటీ సమయం పూర్తయినా వాటిని ైక్లెయిమ్ చేసుకోనివి, కొందరు పాలసీదారులు మృతి చెంది ఉండటంతో వాటిని క్లెయిమ్ చేయకపోవడం, మరికొందరు విదేశాలలో ఉండటంతో చాలా రోజులుగా ఇన్సూరెన్స్ కంపెనీతో సంప్రదింపులు చేయకపోవడం వంటి పాలసీదారుల లిస్ట్ను తయారు చేస్తాడు. పాలసీలు సరెండర్ చేసేందుకు ఆన్లైన్, ఆఫ్లైన్లో అవకాశాలుంటాయి. దీంతో ఆన్లైన్లో ఇలాంటి వాటిని ఒక ప్రణాళిక ప్రకారం సాయి హర్ష సరెండర్ చేసి, ఆ డబ్బును ఖాతాలో వేయిస్తాడు. ఇందుకు గ్రాఫిక్ డిజైనర్ అయిన నిజామాబాద్కు చెందిన దుప్పలపాడి అక్షయ్కుమార్ అలియాస్ టోనీతో పాలసీదారులకు సంబంధించిన నకిలీ పాన్, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులను తయారు చేయిస్తాడు. వీటిని ఉపయోగించి మహ్మద్ యాసిన్ అహ్మద్, మాన్యం ప్రశాంత్ అలియాస్ సాయిలతో అసలైన పాలసీదారుల పేరుతో సౌత్ ఇండియా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్లలో బ్యాంకు ఖాతాలు తెరిపించాడు. అందుకు తనతో గతంలో పనిచేసిన ఉటుకురి అచ్యుత్, అంగుల ప్రకాశ్ రెడ్డి సహకారం తీసుకుంటాడు.
సరెండర్ మెయిల్ పంపించి
బ్యాంక్ ఖాతాలు, కొత్త ఈ మెయిల్ ఐడీలు క్రియేట్ చేసిన తరువాత, ఇన్సూరెన్స్ కంపెనీలో ఆపరేషన్ టీమ్స్కు సంబంధించిన లాగిన్లోకి వెళ్లి, అక్కడ ఎవరైతే కస్టమర్ పాలసీని సరెండర్ చేయాలని ప్లాన్ చేశారో, వాళ్ల ప్రొఫైల్లోకి వెళ్లి నకిలీ ఈ మెయిల్ ఐడీ, కాంటాక్టు వివరాలు అందులో అప్డేట్ చేస్తాడు. ఆ తరువాత అందులో పొందుపరిచిన ఈమెయిల్ ఐడీతో పాలసీని సరెండర్ చేయమంటూ, అందుకు సంబంధించిన నగదును ఫలానా ఖాతాలోకి బదిలీ చేయాలంటూ ఈ మెయిల్ పంపిస్తాడు. అయితే అతడి ప్రొఫైల్ ఉండే ఈ మెయిల్ ద్వారానే సరెండర్ మెయిల్ రావడంతో బ్యాంకు అధికారులు ఆ పాలసీని సరెండర్ చేస్తారు. ఆ నగదును నకిలీలు తెరిచిన బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేస్తారు. అనంతరం ఆ ఖాతాలో నుంచి డబ్బు డ్రా చేసి ఎవరి వాటాలు వారు పంచుకుంటారు. 2019 నుంచి ఇప్పటి వరకు 19 ఘటనలలో రూ.4 కోట్లు ఈ ముఠా డ్రా చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనలలో పాలసీదారులకు తమ పాలసీలు సరెండర్ అయిన విషయం ఎవరికి తెలియదు.
ఇలా బయటపడింది…
యాప్రాల్కు చెందిన ఎన్ఆర్ఐ 2012, 2014లో రూ.45 లక్షల విలువైన రెండు యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు(యూఎల్ఐపీ) తీసుకున్నాడు. ఈ రెండు పాలసీలు తీసుకునే సమయంలో ఒక దాంట్లో తన ఈమెయిల్ ఐడీ పొరపాటున ఒక అక్షరం తప్పుగా పడింది. దీంతో ఆ పాలసీకి సంబంధించిన సమాచారం రావడం లేదు. విదేశాలలో ఉద్యోగాలు ఉండడంతో ఈ విషయం ఆలస్యంగా తెలవడం, బ్యాంకుకు వెళ్లి మార్చేందుకు ఆలస్యమైంది. ఇటీవల తన పాలసీకి సంబంధించిన వివరాలు అప్డేట్ చేసేందుకు బ్యాంకుకు వెళ్లి బ్యాంకు అధికారులను సంప్రదించాడు. అయితే మీ పాలసీ సరెండర్ అయ్యిందని, రూ.76,00,562 కిశోర్కుమార్ పేరుతో సౌత్ ఇండియా బ్యాంక్లో డిపాజిట్ అయ్యాయంటూ ఆపరేషన్ టీమ్ అతడికి చెప్పడంతో ఖంగుతిన్నాడు. దీనిపై రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏసీపీ వెంకటేశం నేతృత్వంలో ఇన్స్పెపెక్టర్ నరేందర్గౌడ్ బృందం రంగంలోకి దిగి ఆరా తీసింది. నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.60 లక్షల విలువైన నగదు, నగలు, వాహనాలు ఇతర వస్తువులతో పాటు ఎయిర్గన్ను స్వాధీనం చేసుకున్నారు. పాలసీ దారులు తమ పాలసీలను తరుచుగా ఆరా తీయాలని, తమ ప్రొఫైల్ అప్డేట్ చేసుకుంటూ అనుమానిత మెయిల్స్ వచ్చినప్పుడు వెంటనే బ్యాంకులకు వెళ్లి పాలసీల గురించి తెలుసుకోవాలని, సైబర్మోసం జరిగితే 1930, సైబర్క్రైమ్.జీవోవి.ఇన్కు వెంటనే సమాచారం ఇవ్వాలని సీపీ సూచించారు. ఈ సమావేశంలో సైబర్క్రైమ్స్ డీసీపీ బి.అనురాధ, రాచకొండ క్రైమ్స్ డీసీపీ మధుకర్స్వామి, సైబర్క్రైమ్స్ ఏసీపీ వెంకటేశ్వం, ఇన్స్పెక్టర్ నరేందర్గౌడ్, ఎస్సై పరమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.