సిటీబ్యూరో, మార్చ్ 13(నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్ల మాయలో పడి సర్వస్వాన్ని కోల్పోతున్న అమాయకులను కాపాడుకుంటూ సమాజంలో సైబర్నేరాలపై ప్రజలను అప్రమత్తం చేసేలా ప్రతిపౌరుడు చొరవ తీసుకోవాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ పిలుపునిచ్చారు. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడంలో వలంటీర్ల పాత్రే కీలకమన్న సజ్జనార్ సోషల్మీడియా వినియోగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వాట్సాప్ గ్రూపుల్లో కేవలం గుడ్మార్నింగ్, గుడ్నైట్ మెసేజ్లకే పరిమితం కాకుండా సైబర్ నేరాల అవగాహన సందేశాలను షేర్ చేయాలని సూచించారు.
హైదరాబాద్ నగరాన్ని సైబర్ నేర రహిత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పోలీసు శాఖ సైబర్ సింబా పేరుతో ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో శుక్రవారం బంజారాహిల్స్లోని ఐసీసీసీ వేదికగా జరిగిన ఓరియేంటేషన్ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పాల్గొని వలంటీర్లకు దిశానిర్దేశం చేశారు. జాగృత్ హైదరాబాద్-సురక్షిత్ హైదరాబాద్ ప్రచారంలో భాగంగా ప్రజల్లో ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని, ఈ క్రమంలో పోలీసులతో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చిన స్వచ్ఛంద సేవకులను సైబర్ సింబాగా వ్యవహరిస్తామని సజ్జనార్ తెలిపారు.
గత నాలుగునెలల్లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1717 మంది వలంటీర్లుగా నమోదు చేసుకున్నారని, వీరికి సైబర్ సేఫ్టీ , ఆన్లైన్మోసాల గుర్తింపుపై పోలీస్ శాఖ ప్రత్యేక శిక్షణనిచ్చిందన్నారు. 5118 డోర్టు డోర్ కార్యక్రమాల ద్వారా రెండు లక్షల మందికి అవగాహన కల్పించినట్లు తెలిపారు. శిక్షణపొందిన వలంటీర్లు తమ ప్రాంతాల్లో ప్రజలను చైతన్య పరచడంతో పాటు గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతను వివరిస్తారని, డిజిటల్ అరెస్ట్ , ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ మోసాల పై ఎలా అప్రమత్తంగా ఉండాలో ప్రజలకు చెప్తారని సజ్జనార్ అన్నారు.
సమాజానికి దేశానికి మేలు చేసే విధంగా వలంటీర్లు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని, మాయమాటలు చెప్పి లక్షలు దోచుకుంటున్న కేటుగాళ్ల పై అప్రమత్తంగా ఉంటూనే ప్రతి ఒక్కరూ సైబర్ యోధులుగా మారాలని పిలుపునిచ్చారు. అందరూ కలిసి కృషి చేస్తేనే హైదరాబాద్ను సైబర్క్రైమ్ రహిత నగరంగా తీర్చిదిద్దగలమని సజ్జనార్ అన్నారు. క్రైమ్స్ అడిషనల్ సీపీ శ్రీనివాసులు, డీసీపీలు అరవింద్బాబు, ఎస్ చైతన్యకుమార్, చంద్రమోహన్, రాజేశ్, లావణ్యనాయక్ జాదవ్ తదితరులతో పాటు వలంటీర్లు పాల్గొన్నారు.