హైదరాబాద్ : ద్విచక్ర వాహనాల సైలెన్సర్లలో మార్పులు చేసి.. శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న వాహనదారులపై సిటీ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కువ శబ్దం చేస్తున్న సైలెన్సర్లను వాహనాల నుంచి తొలగించి.. రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. నగరంలో అధిక శబ్దాలు చేస్తున్న సుమారు వెయ్యి వాహనాల సైలెన్సర్లను పోలీసులు స్వాధీనం చేసుకొని, వాహనదారులకు జరిమానాలు విధించారు. కేబీఆర్ పార్క్ వద్ద బైక్ మెకానిక్లు, ఆటో మొబైల్ దుకాణాల యజమానులకు సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్పై అవగాహన కల్పించారు.
ఎక్కువ శబ్దాలతో వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 12,938 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సైలెన్సర్లు అమ్మే వ్యాపారులకు సైతం పోలీసులు అవగాహన కల్పించినట్లు తెలిపారు. అతిగా శబ్దం చేసే సైలెన్సర్లతో వాహనదారులు పట్టుబడితే తొలిసారి రూ.వెయ్యి జరిమానా విధిస్తామని, రెండోసారి పట్టుబడితే రూ.2వేలు జరిమానా విధించనున్నట్లు చెప్పారు. వరుసగా ట్రాపిక్ ఉల్లంఘనకు పాల్పడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
వాహనానికి సంబంధించిన హారన్ సౌండ్, సైలెన్సర్ ఎలా ఉండాలని అని రీసెర్చ్ చేసిన తర్వాత కంపెనీలు బైక్లను తయారు చేస్తారన్నారు. సౌండ్ పొల్యూషన్ చేస్తూ రోడ్లపై యువకులు బైక్ రేసింగ్ పాల్పడుతున్నారని, రోడ్లపై వెళ్లే వారికి సౌండ్ పొల్యూషన్తో అనారోగ్యానికి గురవడంతో పాటు గుండెపోటు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. మెట్రో నగరం ఇమేజ్ను ఏమాత్రం తగ్గకుండా అందరూ శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగస్వాములు కావాలన్నారు.