కవాడిగూడ, మే 17 : పాదచారులు ట్రాఫిక్లో రోడ్డు దాటేందుకు పెలికాన్ సిగ్నల్స్ ఎంతో ఉపయోగపడుతాయని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. సిగ్నల్స్ దాటే క్రమంలో ఎంతో మంది పాదచారులు ప్రాణాలు కోల్పోతున్నారని, వాటిని అరికట్టేందుకు పెలికాన్ సిగ్నల్స్ను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే ట్రాఫిక్ రద్దీ ఉన్న చోట్ల ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. సేవ్ సిటీ ప్రాజెక్ట్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ట్యాంక్బండ్పై ఓల్డ్ లవ్ హైడ్ పాయింట్ సమీపంలో పెలికాన్ సిగ్నల్స్ను పలువురు పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ ఆనంద్ మాట్లాడుతూ నగరంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు ఎందుకు పనికిరాకుండా పోతున్నాయని, ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జీలను ప్రజలు ఉపయోగించుకోకపోవడం వల్లనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. నగరంలో ఇప్పటి వరకు 30 పెలికాన్ సిగ్నల్స్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెలికాన్ సిగ్నల్స్ వద్ద వలంటీర్లు ఉంటారని చెప్పారు.
ట్రాఫిక్ పోలీసుల కోసం బ్యాగ్ కిట్, బాడీ ఓన్ కెమెరాలు అందజేశామని తెలిపారు. మండుటెండలో సేవ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం 30శాతం ఎక్కువ జీతాలు ఇస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ ప్రియాంక, ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ సుధీర్బాబు, కమిషనర్ గజారావు బోపాల్, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, అశోక్, చిక్కడపల్లి ఏసీపీ ఎ.యాదగిరి, గాంధీనగర్ ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్ రావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నానూ నాయక్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతి యేడాది రోడ్డు ప్రమాదాల్లో 45శాతం మంది పాదచారులే చనిపోతున్నారని సీపీ ఆనంద్ అన్నారు. ముఖ్యంగా రోడ్డు దాటుతున్న సమయాల్లోనే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని, ప్రమాదాలను తగ్గించేందుకే పెలికాన్ సిగ్నల్స్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా మహిళల భద్రత కోసం సేవ్ సిటీ ప్రాజెక్ట్లు ఎన్నో తీసుకొచ్చామని చెప్పారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ఇలాంటి సిగ్నల్ సిస్టంలు ఉన్నాయన్నారు. పెలికాన్ సిగ్నల్ సిస్టం వద్ద శిక్షణ పొందిన వలంటీర్లను పెడుతున్నామని తెలిపారు. కొన్ని దేశాల్లో ఇలాంటి సిస్టం ఆటోమెటిక్గా ఉంటుందని చెప్పారు.