సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): సైబర్నేరాలను అరికట్టే అంశంపై హైదరాబాద్ సైబర్క్రైమ్ విభాగం విశ్లేషణ మొదలుపెట్టింది. ఈ అధ్యయన నివేదికను రాష్ట్ర సైబర్ క్రైమ్ బ్యూరో ద్వారా కేంద్రానికి పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2023లో జరిగిన సైబర్ నేరాలు, ఆర్థిక పరమైన సైబర్ నేరాలకు సంబంధించిన కేసులను విశ్లేషించి.. అందులో 8 వేల బ్యాంకు ఖాతాలను సేకరించారు. ఆయా ఖాతాల్లో సగానికి పైగా కరెంట్ అకౌంట్స్ ఉన్నాయి. ఈ ఖాతాలు తెరిచిన తరువాత ఎన్ని రోజులకు ఆయా ఖాతాల్లో డబ్బు డిపాజిట్ చేశారు.. ఆ డబ్బు ఎప్పుడు డ్రా చేశారు.. అనే కోణంలో అధ్యయనం చేశారు. అందులో కరెంట్ ఖాతాల్లో మొదటిసారి రూ. 5 లక్షల కంటె ఎక్కువగా డ్రా చేసేందుకు వీలు లేకుండా చూడాలని సైబర్క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఎక్కువగా ఈ ఖాతాలు గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళల నుంచి ఉండగా.. అందులో ప్రైవేట్ బ్యాంకులే ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. ఏ బ్రాంచ్లో.. ఏ అధికారి ద్వారా ఖాతాలు ఓపెన్ అయ్యాయి..
అనే అంశంపై కూడా విశ్లేషించారు. అలా ఓపెన్ చేసిన అధికారి ఎవరు, వారిపై చర్యలు తీసుకున్నారా..? లేదా..? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఉన్నతాధికారుల సూచనల మేరకు ఆయా రాష్ర్టాల్లో నిఘా పెట్టారు. బ్యాంకు ఖాతాలు ఎక్కువగా ఉండే రాష్ర్టాల్లో నిరంతరం ఈ నిఘా కొనసాగుతోంది. ఆయా రాష్ర్టాల్లో ఉన్న ప్రత్యేక బృందాలు గుర్తించిన ఖాతాలను ఫ్రీజ్ చేసి, నిందితులను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల పార్ట్టైమ్ జాబ్ పేరుతో జరుగుతున్న ఇన్వెస్ట్మెంట్ మోసాలను కట్టడి చేసేందుకు పోలీసులు అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థులు, యువత, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు అవగాహన కల్పించనున్నారు. పార్ట్టైమ్ ఉద్యోగం పేరుతో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు చేపట్టిన ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు.