బేగంపేట్, మే 29 : రానున్న వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకొని నాలా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం బేగంపేట్లోని బ్రాహ్మణవాడిలో నాలా పనులను ఆమె ఎమ్మెల్సీ వాణీదేవితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ బేగంపేట్ డివిజన్లో కూకట్పల్లి నాలాను ఆనుకొని ఉన్న బ్రాహ్మణవాడి, అల్లంతోట బావి, వడ్డెర బస్తీ, ప్రకాశ్ నగర్ ఎక్స్టెన్షన్, మయూరిమార్గ్ బస్తీలు వర్షాకాలంలో ముంపునకు గురవుతున్నాయని తెలిపారు. ముంపు సమస్యను పరిష్కరించేందుకు ఎస్ఎన్డీపీ కింద రూ.45 కోట్లతో నాలా విస్తరణ పనులతో పాటు రిటైనింగ్ వాల్వ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.
అదేవిధంగా సీవరేజీ, స్టామ్ వాటర్ పైపులైన్లను వేర్వేరుగా వేయాలని అధికారులకు సూచించారు. భారీ వర్షాలకు నాలాలోని నీరు పొంగి కాలనీల్లోకి రాకుండా రిటైనింగ్ వాల్వుల ఎత్తును పెంచడంతో పాటు లోతట్టు ప్రాంతాలకు ప్రవహించకుండా సంపులను నిర్మించి పంపింగ్ ద్వారా నీటిని తొలగించే చర్యలు చేపట్టాలని తెలిపారు. బ్రాహ్మణవాడి నుంచి గీతాంజలి స్కూల్ వరకు రూ.39 కోట్లతో నిర్మించనున్న వీడీసీసీ రోడ్లు, సీవరేజీ లైన్లు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా బ్రాహ్మణవాడి పక్కన ఉన్న శ్రీ రామానంద తీర్ధ ట్రస్టును సందర్శించారు. ట్రస్టు ప్రాంగణంలో వర్షం నీరు నిలువకుండా గేట్ల ద్వారా నాలాలోకి మళ్లించాలని తెలిపారు. ర్యాంపు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రస్ట్లో నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను, సమ్మర్ కోచింగ్ క్యాంపు గురించి అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం బేగంపేట్ ధనియాలగుట్టలో వైకుంఠ ధామాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరి, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, ఎస్ఈ భాస్కర్రెడ్డి, ఈఈ సుదర్శన్, జలమండలి అధికారి ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.