సిటీబ్యూరో, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ): అసలే పండుగ, అందులో వీకెండ్ ఇంకేముంది.. కాంక్రీట్ జంగిల్లో విద్యా, ఉద్యోగాల దృష్ట్యా నెట్టుకొచ్చిన ఊరి జనాలు సొంతూళ్లకు బయల్దేరి వెళ్లిపోయారు. పిల్లాపాపలతో సొంతూళ్లకు వెళ్లడంతో నగర జనాభా పల్చన పడింది. పండుగ నేపథ్యంలో మూడు రోజుల ముందు నుంచే నగరాన్ని వీడుతుండగా, నగరంలోని ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, టోల్ ప్లాజాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. యేటా దసరా, సంక్రాంతి పండుగల కోసం జనాలు ఎక్కువ మంది సొంతూళ్లకు వెళ్లిపోతుంటారు. ఈ క్రమంలో నగరంలోని ఎంజీబీఎస్, జేబీఎస్తో పాటు శివారు ప్రాంతాల్లోని ప్రధాన జంక్షన్లన్నీ జనాలతో సందడి నెలకొన్నాయి. దీంతో నిత్యం రద్దీగా ఉండే అమీర్పేట్, సనత్ నగర్, కూకట్పల్లి, మెహదీపట్నం, సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్తో పాటు శివరాంపల్లి జంక్షన్ వాహనాలతో నిండిపోయాయి. ఇక విజయవాడ, ఖమ్మం, వరంగల్ వంటి ప్రాంతాలకు వెళ్లే ఎల్బీనగర్, ఉప్పల్ కేంద్రాలకు చేరుకునేందుకు మెట్రో మార్గంలో ప్రయాణిస్తుండగా.. ఉదయం 11 గంటల నుంచి మొదలుకుంటే రాత్రి 9గంటల వరకు రద్దీ కొనసాగుతుంది. దీంతో నగరంలో ఇప్పటికే మెజార్టీ ప్రజలు సొంతూళ్లకు వెళ్లిపోగా, ఆదివారం మధ్యాహ్నానికి నగరం సగం ఖాళీ కానున్నట్టు తెలుస్తున్నది.
జంక్షన్ల వద్ద తగ్గిన వాహనాల రద్దీ
సాధారణ రోజుల్లో నగరంలోని ఖైరతాబాద్, పంజాగుట్ట, మలక్పేట్, ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, ప్యారడైజ్ వంటి సిగ్నళ్ల వద్ద భారీగా వాహనాల రద్దీ కనిపించేది. నగరంలో జనాల సంచారం తగ్గిపోవడంతో ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్ రద్దీ కొంత మేర తగ్గు ముఖం పట్టింది. మూడు రోజుల పాటు ఇదే తీరుగా ట్రాఫిక్ సిగ్నళ్లన్నీ బోసిపోనుండగా శివారు ప్రాంతాల్లో ఇప్పటికీ వాహనాల రద్దీ కొనసాగుతూనే ఉంది. నగరం నుంచి బయలుదేరి సొంతూళ్లకు వెళ్లేవారితో నల్గొండ వెళ్లే మార్గంలో ఉండే పంతంగి, యాదాద్రి గూడూరు, బెంగుళూర్ హైవే ఉన్న రాయికల్ టోల్ ప్లాజాలన్నీ వాహనాలతో కొంత మేర ట్రాఫిక్ నిలిచిపోతున్నంది.